పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే..!

16 Nov, 2020 08:38 IST|Sakshi
సంతోష్‌రావు (ఫైల్‌)

అనంతపూర్‌లో రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి

కోరుట్లలో పెళ్లింట విషాదం

సాక్షి, కోరుట్ల ‌: అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు వైద్యుడిగా స్థిరపడితే ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు.. పెళ్లి చేసి, మురిసి పోవాలని ఆశపడితే రోడ్డు ప్రమాదంలో అతని మృతి వారికి తీరని శోకాన్ని మిగిల్చింది. పది రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన కుమారుడి మృతదేహాన్ని చూసి, ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించిన సంఘటన కోరుట్లలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిరిసిల్ల జిల్లాలోని ముష్టిపల్లికి చెందిన గన్నమనేని చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ డ్రైవర్‌ పని చేసి, రిటైర్‌ అయ్యారు. ఉద్యోగంలో ఉండగానే కోరుట్లలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య స్వరూప, ఇద్దరు కుమారులు సంతోష్‌రావు, సవ్యసాత్వి ఉన్నారు. కుమారులను ఉన్నత చదువులు చదివించారు. పెద్ద కుమారుడు వైద్యుడిగా కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు సవ్యసాత్వి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. సంతోష్‌రావు(29)కు కరీంనగర్‌లోని ఓ వైద్యురాలితో రెండు నెలల కిందట నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 26ను పెళ్లి పెట్టుకున్నారు. చదవండి: ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

అతని తమ్ముడు సవ్యసాత్వి అన్న పెళ్లి కోసం అమెరికా నుంచి వారం రోజుల కిందటే కోరుట్లకు చేరుకున్నాడు. ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి పెళ్లి పనులు చూస్తున్నాడు. పెళ్లి చేసుకునేందుకు సంతోష్‌రావు తన స్నేహితుడితో కలిసి సొంత కారులో శనివారం కోరుట్లకు బయలుదేరాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కేంద్రంలో ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోష్‌రావుకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎదిగిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. సంతోష్‌రావు మృతదేహాన్ని చూసేందుకు బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అతని మృతదేహానికి, జిల్లెడు చెట్టుకు పెళ్లిచేసి, అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేశారు.  

మరిన్ని వార్తలు