కలిసి చదువుకున్నారు.. ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని ఫొటోలు మార్ఫింగ్‌ చేసి..

25 May, 2022 15:27 IST|Sakshi
భరద్వాజ్‌ను అరెస్టు చేసిన కరీంనగర్‌ పోలీసులు 

సాక్షి, కరీంనగర్‌: సోషల్‌ మీడియాలో ప్రేమ పేరుతో యువతిని, ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తోన్న యువకుడిని కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోటి ఉమెన్స్‌ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తోన్న ఆదిత్య భరద్వాజ్, కరీంనగర్‌లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీలో 2019 నుంచి 2021 వరకు పీజీ కలిసి చదువుకున్నారు. కొద్దిరోజుల స్నేహం తర్వాత యువతిని ప్రేమిస్తున్నానని తెలుపగా ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న భరద్వాజ్‌ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు.

స్నేహంగా ఉన్న రోజుల్లో యువతి కుటుంబ సభ్యులతో తీయించుకున్న పాత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వేధించసాగాడు. వీలైన ప్రతి చోటా ఆన్‌లైన్‌లో యువతికి, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. పెళ్లి చేసుకోకుంటే యాసిడ్‌పోస్తానని బెదిరింపులకు గురిచేసేవాడు. తెలంగాణ మోడల్‌ స్కూల్‌ గంగాధర సోషల్‌ మీడియా అకౌంట్‌ను ట్యాగ్‌ చేస్తూ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టేవాడు. అతడి వేధింపులు భరించలేని యువతి ఈ నెల 10న గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

లోతుగా విచారించిన పోలీసులు
ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. భరద్వాజ్‌ కదలికలపై దృష్టి పెట్టారు. వనపర్తిలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లగా అక్కడే అరెస్టు చేశారు. వేములవాడ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించారు. పోలీసులు అరెస్టు చేయగా కొందరు వీడియో తీసినవి సోషల్‌ మీడియాలో రావడంతో కిడ్నాప్‌ అంటూ వార్తలు వచ్చా యి. దీనిపై వనపర్తిలోని ఒక పోలీసు అధికారి కిడ్నాప్‌ కాదు ఓ కేసులో అరెస్టు చేసినట్లు వివరించారు.
చదవండి: Crime News: ఆమెకు పెళ్ళైంది కానీ..

మరిన్ని వార్తలు