Hyderabad: ప్రేమించిన యువతితో యువకుడి పరార్‌.. ఇద్దరి జాడ చెప్పాలంటూ..

2 May, 2022 14:37 IST|Sakshi
గాయాలతో శాంతయ్య, రాజేశ్వరి

యువకుడి తల్లిదండ్రులపై యువతి బంధువుల దాడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రేమించిన యువతిని తీసుకెళ్లిన ఓ యువకుడి తల్లిదండ్రులపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలకు గురైన యువకుడి తండ్రిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. సర్దార్‌పటేల్‌ నగర్‌లో నివసించే గాయత్రి, నరేష్‌ ప్రేమించుకున్నారు. వారివారి ఇళ్లల్లో వివాహానికి అంగీకరించకపోవడంతో శనివారం రాత్రి గాయత్రి, నరేష్‌లు కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయారు.

విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు, అర్ధరాత్రి శాంతయ్య ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న శాంతయ్య, రాజేశ్వరి దంపతులపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఇద్దరిని బలవంతంగా తమ ఇంటికి తీసుకొని వెళ్లిన గాయత్రి బంధువులు, వారిని ఓ గదిలో బంధించి నరేష్‌ ఆచూకీ తెలపాలని చిత్రహింసలకు గురి చేశారని బాధితురాలు రాజేశ్వరి తెలిపారు. నరేష్‌ ఆచూకీ తెలుపకుంటే చంపుతామని బెదిరించి వదిలేశారని, తన భర్త చెయ్యి, రెండు చేతి వేళ్లు విరిగాయని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు వాపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని కేపీహెజ్‌బీ సీఐ కిషన్‌కుమార్‌ తెలిపారు.  
చదవండి: Hyderabad: మెట్రో స్టేషన్‌ వద్ద యువకుడి హంగామా

మరిన్ని వార్తలు