Kurnool: నంద్యాలలో కానిస్టేబుల్‌ దారుణ హత్య 

8 Aug, 2022 15:22 IST|Sakshi

సాక్షి, నంద్యాల: నంద్యాల పట్టణంలో ఓ కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్సీ ఆఫీసులో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గూడూరు సురేంద్రకుమార్‌ (37) విధులు ముగించుకొని ఆదివారం రాత్రి  ఆఫీసు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాజ్‌ థియేటర్‌ సమీపంలో ఆరుగురు పాతనేరస్తులు అడ్డగించి అటుగా వస్తున్న ఆటోను ఆపి అందులో ఎక్కించుకుని చిన్నచెరువు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సురేంద్రకుమార్‌ను కత్తులతో పొడిచి హత్యచేసి వెళ్లిపోయారు.

దీంతో కొన ఊపిరితో ఉన్న సురేంద్రను ఆటో డ్రైవర్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విషయం తెలియజేశాడు. అక్కడ నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. మృతదేహాన్ని ఎస్పీ కె. రఘువీర్‌రెడ్డి పరిశీలించారు. మూడో పట్టణ సీఐ మురళీమోహన్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. కాగా, దాడిలో పాల్గొన్న వారిపై కానిస్టేబుల్‌ గతంలో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  

నంద్యాలలో హత్యకు గురైన కానిస్టేబుల్ సురేంద్ర మృతదేహానికి జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి నివాళులు అర్పించారు. కానిస్టేబుల్ హత్యకు పాల్పడిన దుండగులను త్వరలోనే పట్టుకుంటాని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, ఎట్టిపరిస్థితుల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 
చదవండి: బాలుడి ముక్కు కొరికేసిన పొలిటికల్‌ లీడర్‌.. అంత కోపం దేనికో?

మరిన్ని వార్తలు