తమిళనాడులో పేలుడు.. ఏడుగురు మృత్యువాత

4 Sep, 2020 19:59 IST|Sakshi

చెన్నై: తమిళనాడులోని కడలూరులో విషాదం చోటుచేసుకుంది. టపాసుల కర్మాగారంలో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యజమాని సహా ఏడుగురు మృతి చెందారు. మరో నలుగు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాగా ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న తీరు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. మృతులంతా మహిళలే. (చదవండి: ఆయిల్‌ ట్యాంకర్‌లో అగ్ని ప్రమాదం)

ఈ ఘటన గురించి కడలూరు ఎస్పీ శ్రీ అభినవ్‌ మాట్లాడుతూ.. ‘‘కట్టుమన్నార్‌కోలికి సమీపంలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్‌ ఉంది. మృతులంతా అక్కడ పనిచేసే వాళ్లే. నాటు బాంబులు తయారు చేస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నాం. పరిమితికి మించి పేలుడు పదార్థాలు వాడినందు వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నాం. లోతుగా దర్యాప్తు చేస్తాం’’అని పేర్కొన్నారు. కాగా కరోనా లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో వివిధ ఫ్యాక్టరీల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరిపేందుకు వీలుగా తమిళనాడు ప్రభుత్వం  అనుమతినిచ్చిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు