Loan App: నకిలీ లెటర్‌తో రూ.కోటి కొట్టేశాడు..! 

1 Jun, 2021 06:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిటీబ్యూరో: అక్రమ మైక్రోఫైనాన్సింగ్‌ వ్యవహారాలకు పాల్పడిన లోన్‌ యాప్స్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఓ పక్క ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేశారు. మరోపక్క కొత్త ఎత్తు వేసిన ఓ సైబర్‌ నేరగాడు పోలీసులు ఫ్రీజ్‌ చేసిన బ్యాంకు ఖాతాను డీ–ఫ్రీజ్‌ చేయించాడు. అందులో ఉన్న రూ.1.18 కోట్లు ఓ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేశాడు.

దీనిపై సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో అక్రమ వ్యవహారాలకు పాల్పడ్డ 32 కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలను గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రూ.400 కోట్లకుపైగా ఫ్రీజ్‌ చేశారు. ఈ ఖాతాల్లో కోల్‌కతాలోని ఐల్‌పోరే ప్రాంతంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులోది కూడా ఉంది. ఈ ఖాతాను పోలీసులు గత ఏడాది డిసెంబర్‌లో స్తంభింపచేశారు.  అయితే ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బ్యాంక్‌ మేనేజర్‌ను సంప్రదించి.. తాను ఎస్‌ఐగా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు.

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రాసినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటిని ఆ మేనేజర్‌కు అందించి ఖాతాను డీ–ఫ్రీజ్‌ చేయించాడు. ఆపై గత నెల 13నరూ.1,18,70,779 స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆనంద్‌ జన్ను పేరుతో ఉన్న ఖాతాలోకి బదిలీ చేసి స్వాహా చేశాడు. గత నెల 20 మరికొంత మొత్తం ట్రాన్స్‌ఫర్‌ చేయించడానికి ప్రయత్నించాడు. దీనిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.దీంతో బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
చదవండి: భార్యాభర్తల తరహాలో జీవితం.. మూడుసార్లు అబార్షన్‌: నటి చాందిని

మరిన్ని వార్తలు