Love Couple: ఇద్దరిని బలితీసుకున్న ప్రేమ వ్యవహారం

10 Jul, 2022 13:09 IST|Sakshi
పావని (ఫైల్‌), నరేందర్‌ (ఫైల్‌)

పెళ్లికి నిరాకరించాడని యువతి, భయంతో యువకుడి బలవన్మరణం

సాక్షి, నారాయణపేట: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపానికి గురైన యువతి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. భయంతో యువకుడు సైతం రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని పోస్టాఫీస్‌ సమీపంలో నివాసం ఉండే పోతిరెడ్డిపల్లికి చెందిన పావని(18) హైదరాబాద్‌లో చదువుతుండగా.. కోస్గికి చెందిన నరేందర్‌ (19) స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

వీరిద్దరు ప్రేమించుకుంటున్న విషయం ఈ మధ్యనే తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు ఈ నెల 7న పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. కాగా, నరేందర్‌ పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన పావని అదేరోజు ఇంటికి వెళ్లి కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను పాలమూరు జనరల్‌ ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

అప్పటికే భయంతో ఉన్న నరేందర్‌ సైతం శనివారం ఉదయమే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మహబూబ్‌నగర్‌కు వెళ్లి.. రైలు కిందపడి ఆత్మహ­త్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.  

చదవండి: (ఇన్‌స్టాలో పరిచయం, ఆపై స్నేహం.. చివరికి యువతిని నమ్మించి..)

మరిన్ని వార్తలు