పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్‌కి వెళ్లి..

29 Dec, 2021 06:19 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సొండి వీధిలో విషాదం

సాక్షి, రాయగడ: తమ ప్రేమను పెద్దలు అంగీకరించరన్న మనస్తాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని సొండి వీధిలో మంగళవారం కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న అదనపు ఎస్పీ అనంత నారాయణ మహంతి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. అనంతరం యువతీ, యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

వివరాలిలా ఉన్నాయి.. సొండి వీధికి చెందిన స్వాతి పాత్రో(15), అదే వీధికి చెందిన రాహుల్‌ కౌసల్య(26) గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. రాహుల్‌కు ఇదివరకే పెళ్లయి, ఓ కొడుకు ఉండగా, 5 నెలల క్రితం నుంచి అతడి భార్య, కొడుకు గుణుపూర్‌లోని తన అత్తవారింట్లోనే ఉంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న రాహుల్‌ స్వాతితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఒకరిపై మరొకరు మరింత ఇష్టం పెంచుకుని పెళ్లి చేసుకోవాలని భావించారు. అయినా పెళ్లయిన వ్యక్తికి మళ్లీ అమ్మాయిని ఎలా ఇచ్చి, పెళ్లి చేస్తారని అనుకున్న వారు చనిపోయేందుకు సిద్ధమయ్యారు. రాహుల్‌ ఇంట్లోనే ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకున్నారు.  

చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..)

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. 
ఎప్పటిలాగే ఉదయం ట్యూషన్‌కి వెళ్లిన కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన యువతి తల్లిదండ్రులు ట్యూషన్‌ మాస్టారు ఇంటికి వెళ్లి, తమ కూతురు ఆచూకీ కోసం అడిగారు. ఈరోజు తను ట్యూషన్‌కు రాలేదని మాస్టారు చెప్పడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామస్తుల సమాచారం మేరకు అదే వీధిలోని రాహుల్‌ ఇంటికి వెళ్లారు.

ఇంటి తలుపులు మూసి ఉండడంతో అనుమానంతో తలుపులు పగలగొట్టి చూశారు. ఈ క్రమంలో ఫ్యాన్‌కు వేలాడుతున్న స్వాతి, రాహుల్‌ కనిపించారు. అప్పటికే చనిపోయిన స్వాతిని చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కొనఊపిరితో ఉన్న రాహుల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమజంట ఆత్మహత్యపై దర్యాప్తు చేపడుతున్నారు. 

చదవండి: (పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం.. ఓ ప్రబుద్ధుడు పెళ్లి చెడగొట్టడంతో)

మరిన్ని వార్తలు