సినిమాను మించిన లవ్‌స్టోరీ.. విజయవాడ నుంచి పారిపోయి..

18 Feb, 2023 10:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): విజయవాడ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమజంటను యువతి తల్లిదండ్రులు బలవంతంగా కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. విజయవాడ సమీపంలోని సూరంపల్లి మాదలవాడీ గూడెంలో నివసించే గంగుల నవీన్‌ కుమార్‌ (23), అదే ప్రాంతానికి చెందిన బీటెక్‌ విద్యార్థిని (21) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతికి పెళ్లి సంబంధాలు చూస్తుండగా శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి పారిపోయి హైదరాబాద్‌ యూసఫ్‌గూడలోని నవీన్‌ బంధువు ఇంటికి వచ్చారు.

యువతి తల్లిదండ్రులు నవీన్‌ మొబైల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ట్రేస్‌ చేసి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు యూసఫ్‌గూడ చేరుకున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న నవీన్‌ తన ప్రియురాలిని తీసుకుని మరో చోటకు పారిపోయేందుకు బయటకు రాగా అప్పటికే అక్కడ వేచివున్న యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. నవీన్‌ అరుస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయగా అక్కడ గుమిగూడిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రేమజంటను, తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. సోమవారం ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకుందామని ఇక్కడకు వచ్చినట్లు నవీన్‌ తెలిపారు. తన ప్రియురాలిని బలవంతంగా ఆమె తల్లిదండ్రులు కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది అన్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: వేలి ముద్రలు వేస్తున్నారా?.. అయితే ఇది కచ్చితంగా చదవాల్సిందే..

మరిన్ని వార్తలు