పెళ్లయిన వ్యక్తితో సహజీవనం.. కారులో మంత్రాలయం వచ్చి..

7 Oct, 2022 08:11 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, మంత్రాలయం రూరల్‌: మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. నిద్రమాత్రల పొడి తాగి ప్రేమజంట ఆత్మహత్యకు ప్రయత్నించగా వ్యక్తి మృతి చెందాడు. మహిళ చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఏరేడు మండలం ఉల్వలపాడు గ్రామానికి చెందిన వేణు, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విష్ణుప్రియ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు.

బుధవారం రాత్రి కారులో మంత్రాలయం చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వెంట తెచ్చుకున్న నిద్రమాత్రల పొడిని నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గురువారం ఉదయం విష్ణుప్రియ అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంటుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగుచూసింది. అక్కడ పడిఉన్న వేణు (32)ను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విష్ణుప్రియను 108 ద్వారా ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. వేణు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి భార్య సాయిప్రతిష, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విష్ణుప్రియ గత కొద్ది రోజులుగా కనిపించడం లేదని దర్శి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదై విచారణలో ఉంది. ఈ మేరకు దర్శి పోలీసుల సమక్షంలో విష్ణుప్రియను కుటుంబ సభ్యులకు అప్పగించారు.   

చదవండి: (డేటింగ్‌ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు)

మరిన్ని వార్తలు