Love Couple Suicide: ప్రేమలేనిదే జీవించలేమని.. ప్రేమికుల ఆత్మహత్య

11 Jan, 2022 09:21 IST|Sakshi
ప్రేమికులు అఖిల,సాయితేజ

సాక్షి, రాజాపేట(నల్లగొండ): పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదని, పెళ్లికి కూడా ఒప్పుకోరని భావించిన ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

రాజాపేట మండలం బూర్గుపల్లికి చెందిన కోటోజు కృష్ణమూర్తి, మాధవి దంపతుల కుమారుడు సాయితేజ(20), అదే గ్రామానికి చెందిన మాడిశెట్టి నర్సింహులు, అనిత కుమార్తె అఖిల(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అఖిల ఇంటర్మీడియట్‌ ఇటీవల పూర్తి చేయగా సాయితేజ ఇంటర్‌ మధ్యలోనే వదిలేసి గ్రామంలోని పాల సెంటర్‌లో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. 

ప్రేమ విషయం తెలియడంతో.. 
సాయితేజ, అఖిల ప్రేమ వ్యవహారం నెలరోజుల క్రితం పెద్దలకు తెలిసింది. అప్పటి నుంచి నర్సింహులు తన కూతురు అఖిలను సమీప గ్రామం నెమిలలోని బంధువుల వద్ద ఉంచాడు. కాగా, ఆదివారంరాత్రి పాలసెంటర్‌లో విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన సాయితేజ రాత్రి 9 గంటల సమయంలో ఫోన్‌కాల్‌ రావడంతో బయటికి వెళ్లాడు. మరోవైపు ఆదివారం రాత్రి నుంచే అఖిల కూడా కనిపించడంలేదని తెలిసిన తండ్రి నర్సింహులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

చెట్టుకు ఉరేసుకుని.. 
సోమవారం సాయంత్రం సాయితేజ తాత శ్రీహరి మేకలు తోలుకుని తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా, అప్పటికే ఇద్దరు ప్రేమికులు చెట్టుకు చున్నీతో ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. ప్రేమజంట అఘాయిత్యంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తలు