ఇద్దరూ అన్యోన్యంగా.. అంతలోనే ఏమైందో..

17 Feb, 2021 21:57 IST|Sakshi

భువనేశ్వర్‌ : నవరంగపూర్‌ జిల్లా ఝోరిగాం సమితి కుటిరచొపర్‌ గ్రామ పంచాయతీ కిలిగౌడసాహి గ్రామంలో విషం తాగి ఓ ప్రేమ జంట సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. 15 రోజులుగా దంపతుల్లా కలిసిమెలిసి జీవిస్తున్న ప్రేమజంట అకస్మాత్తుగా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశమైంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఖామ్‌సింగ్‌ గౌడ చిన్న కుమారుడు ఇంద్ర గౌడ, అదే గ్రామానికి చెందిన జయసింగ్‌ గౌడ చిన్న కుమార్తె దుతిక గౌడ ప్రేమించుకున్నారు. 15 రోజుల కిందట ప్రేమికురాలు దుతిక గౌడను  ఇంద్రగౌడ తన ఇంటికి తీసుకు వచ్చాడు. ఆ రోజునుంచి దంపతుల్లా ఇద్దరూ నూతన జీవనం ప్రారంభించారు.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇద్దరూ అన్యోన్యంగా.. ఆనందంగా ఉంటున్నారని అందరూ భావించారు. అయితే వారిద్దరూ విషం తాగి గిలగిలా కొట్టుకుంటుండడం చూసిన బంధువులు  ఇద్దరినీ వెంటనే ఝోరిగాం కమ్యూనిటీ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లి చేర్చగా చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ విషయమై ఇరువురి కుటుంబసభ్యులు ఝోరిగాం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాలు అప్పగించారు. ఝోరిగాం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు