టెన్త్‌ అబ్బాయి.. డిగ్రీ అమ్మాయి 

24 Dec, 2020 04:10 IST|Sakshi
గూగులోత్‌ ప్రశాంత్, భూక్యా ప్రవీణ (ఫైల్‌) 

బావిలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య  

సాక్షి, మహబూబాబాద్‌ (గార్ల): తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనన్న భయంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం వడ్లఅమృతండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గార్ల మండలం రాజుతండా పంచాయతీ పరిధి వడ్లఅమృతండాకు చెందిన పదోతరగతి విద్యార్థి గూగులోత్‌ ప్రశాంత్‌ (17), అదే గ్రామానికి చెందిన డిగ్రీ పూర్తిచేసిన భూక్యా ప్రవీణ (22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు.

బుధవారం తెల్లవారుజామున గ్రామ సమీపాన ఉన్న వ్యవసాయ బావిలో మృతదేహాలు నీటిలో తేలడంతో గమనించిన స్థానికులు వారి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాలను బయటకు తీయించారు. వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు ఖాళీ డబ్బా లభించడంతో పురుగులమందు తాగిన అనంతరం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఎస్సై బాదావత్‌ రవి చెప్పారు. అబ్బాయికంటే అమ్మాయి వయసు ఎక్కువ ఉండటం, పెద్దలు వివాహానికి ఒప్పుకోరన్న భయంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, వీరు అక్కా, తమ్ముడు అని సంబోధించుకునేవారని, ప్రేమ వ్యవహారం చెబితే పెళ్లి చేసేవారమని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

బావిలో మృతదేహాలు, (ఇన్‌సెట్‌) 

మరిన్ని వార్తలు