Tragedy Love Story: విషాదంగా ముగిసిన లవ్‌స్టోరీ.. వాట్సాప్‌ చాటింగ్‌ చేసుకుని..

14 Aug, 2022 11:36 IST|Sakshi
రాజు

పాలకుర్తి(జనగామ జిల్లా): తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెబుతారని భావించిన ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామశివారు భీక్యా నాయక్‌ గ్రామ పంచాయతీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. భీక్యా నాయక్‌ గ్రామ పంచాయతీకి చెందిన బాలిక (16), అదే తండాకు చెందిన గుగులోతు పాపా, టీక్యా దంపతుల కుమారుడు రాజు(22) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రాజు కారు డ్రైవర్‌గా పని చేస్తుండగా, దీపిక ఇంటర్‌ చదువుతోంది.
చదవండి: ఏమైందో ఏమో.. అన్నయ్య విదేశాలకు వెళ్లిపోవడంతో..

వీరి ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. తమ పెళ్లి జరగదని భావించిన ఇరువురూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి తండా శివారులోని పల్లె ప్రకృతి వనంలో ముందుగానే సిద్ధం చేసుకున్న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో తండాలోని ఓ అమ్మాయిని ప్రేమించి ఆమె ఆత్మహత్యకు రాజు కారకుడయ్యాడని తండావాసులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రాజు, ఆ బాలిక వాట్సాప్‌ మెసేజ్‌లు చేసుకున్నారని, ఉద్దేశపూర్వకంగానే బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

తమ కూతురికి రాజు బలవంతంగా పురుగుమందు తాగించాడని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి తీసుకెళ్లకుండా తండా వాసులు అడ్డుతగిలారు. పోలీసులు వారికి సర్దిచెప్పి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు