చెరువుకట్టపై చెప్పులు, యాసిడ్‌ బాటిళ్లు.. ప్రేమజంట ఆత్మహత్య

27 Feb, 2021 02:09 IST|Sakshi
సాయిమణికంఠ, ఫాతిమా (ఫైల్‌)

ఫోన్‌లో మాట్లాడుతుండగా ప్రియుడి తండ్రి మందలింపు  

మతాలు వేరు కావడంతో పెళ్లి అంగీకరించరేమోనన్న భయం  

ఇద్దరూ చెరువులో దూకి బలవన్మరణం 

సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం

సాక్షి, కోదాడ: ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మతాలు వేరు కావడం.. ఇంట్లో తెలిస్తే గొడవలు జరుగుతాయన్న భయం.. పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారో లేదోనన్న ఆందోళన.. వెరసి వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన చేగొండి రామయ్య, తిరపమ్మ దంపతుల చిన్న కుమారుడు మణికంఠ అలియాస్‌ సాయి (20) స్థానికంగా ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

సాయి ఇంటి సమీపంలో ఎస్‌కె.కరీమా కూతురు ఫాతిమా (16), కుమారుడితో కలసి నివాసం ఉంటోంది. కోదాడలోని ఉర్దూ పాఠశాలలో ఫాతిమా ఆలిమ్‌ కోర్సు చదువుతోంది. కాగా, సాయి, ఫాతిమా ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం సాయి రాత్రి ఫోన్‌లో మాట్లాడుతుండగా.. ఈ సమయంలో ఎవరికి ఫోన్‌ చేస్తున్నావ్‌ అంటూ తండ్రి మందలించాడు. దీంతో మరుసటి రోజు నుంచి సాయి కనిపించకుండా పోయాడు.  

యాసిడ్‌ తాగి చెరువులో దూకారా?  
శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు చెరువుకట్టపై చెప్పులు, యాసిడ్‌ బాటిళ్లు, రెండు గ్లాసులను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గజ ఈతగాళ్లతో చెరువులో గాలించగా.. ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల నోట్లో నుంచి నురగలు వచ్చాయి. యాసిడా.. లేదా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

చదవండి: (సహజీవనం చేస్తూ ‘రిచ్‌’గా బిల్డప్‌.. పక్కాగా చీటింగ్‌)

మరిన్ని వార్తలు