ఏడాది నుంచి ప్రేమ, సినిమాకు వెళ్లి వస్తుండగా ప్రేమజంట దుర్మరణం

11 Dec, 2022 21:05 IST|Sakshi

సాక్షి, చెన్నై: సినిమాకు వెళ్లి ఓ ప్రేమజంట ద్విచక్రవాహనంలో తిరిగి వస్తుండగా లారీ రూపంలో తిరిగిరానిలోకాలకు తీసుకెళ్లింది. తూత్తుకుడి జిల్లాకు చెందిన బాబిలోన (23) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. చెన్నై జాఫర్‌ఖాన్‌ పేటలో ఉంటూ గిండిలోని ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంది. ఈమె బంధువు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రశాంత్‌ (33) చెన్నై జాఫర్‌ఖాన్‌ పేటలోనే ఉంటూ కుంన్రత్తూరులో ఉన్న ప్రైవేటు సంస్థలో డిజైనింగ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు.

విషయం తెలిసి ఇరువైపు పెద్దలు  వీరి పెళ్లికి అంగీకరించి నిశ్చితార్థం చేశారు. ఈక్రమంలో అన్నానగర్‌ లోని ఓ థియేటర్‌లో సినిమా చూడడానికి బాబిలోన, ప్రశాంత్‌ ఇద్దరు బైక్‌పై వెళ్లారు. సినిమా చూసుకుని తిరిగి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తిరిగి బయలుదేరారు. అరుంబాక్కం మెట్రో రైల్వేస్టేషన్‌ వద్ద వెళుతుండగా వెనుక నుంచి ఇనుపలోడుతో వస్తున్న లారీ బైకును ఢీకొంది.

ఈ ఘటనలో బైకు నుంచి కిందపడిన బాబిలోన, ప్రశాంత్‌లపై లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్‌ పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు అతన్ని పట్టుకుని తర్వాత  అన్నానగర్‌ పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు