ప్రేమజంట ఆత్మహత్య 

1 Jan, 2021 10:11 IST|Sakshi

మల్కన్‌గిరి : పెద్దలు పెళ్లికి నిరాకరించారన్న నెపంతో స్థానిక మల్కన్‌గిరి సమీపంలోని ఎంవీ–42 గ్రామంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గ్రామ స్తుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాలను పోలీసులు తరలించారు. వివరాలిలా ఉన్నాయి..ఎంవీ–42 గ్రామానికి చెందిన బిక్కి సుఖ్‌ధర్, సోరిత ఇద్దరూ గత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో ఈ జన్మలో తమ పెళ్లి కాదని భావించిన వీరు.. బుధవారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటి నుంచి బయటకు పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. జంటగా ఇంటికి వెళ్తే ఇంట్లో వారు ఏమైనా అంటారేమోనన్న భయంతో గ్రామ శివారులోని ఓ మర్రిచెట్టుకి వీరిద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం అటువైపుగా వెళ్తున్న కొంతమంది గ్రామస్తులు చెట్టుకు వేలాడుతున్న వీరి మృతదేహాలు చూసి బాధిత కుటుంబాలు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న ఇరు కుటుంబాల సభ్యులు తమ బిడ్డల మృతదేహాలు చూసి, కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. 
 

మరిన్ని వార్తలు