తల్లి శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని 10 రోజులు గడిపిన కూతురు

21 May, 2022 09:19 IST|Sakshi

తల్లి శవాన్ని పక్కనే పెట్టుకొని 10 రోజులపాటు ఇంట్లోనే గడిపింది ఓ కూతురు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హెచ్ఏఎల్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన సునీత పదేళ్ల కిత్రం తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. లక్నోలోని ఇందిరా నగర్‌లో 26 ఏళ్ల కూతురు అంకితా దీక్షిత్‌తో నివాసముంటోంది. కొన్నేళ్లుగా సునీత క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతోంది.

ఏమైందో  తెలియదు కానీ కొన్ని రోజుల క్రితం సునితా మరణించింది. అయితే తన తల్లి మరణించిన విషయాన్ని అంకిత ఎవ్వరికీ చెప్పలేదు. తల్లి శవాన్ని ఇంట్లోనే పెట్టుకొని 10 రోజులు గడిపింది. రెండు రోజులుగా సునీత ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా.. లొపలి నంచి మెయిన్‌ డోర్‌ లాక్‌ చేసి ఉంది. ఇంట్లో నుంచి మాత్రం యువతి గొంతు వినిపించింది. ఎంత ప్రయత్నించినా యువతి డోర్‌ తీయకపోవడంతో పోలీసులే బలవంతంగా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లోకి వెళ్లగానే అక్కడ ఉన్న దృశ్యాలను చూసి లక్నో పోలీసులు కంగుతున్నారు. 
చదవండి: నా కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయి: తండ్రి

ఒక గదిలో కుళ్లిపోయిన స్థిలో తల్లి మృతదేహం ఉండగా .. కూతురు అంకిత మరో గదిలో ఉండటం గమనించారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే అంకిత మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులకు తెలిసింది. అందుకే తల్లి మరణించినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేదని పేర్కొన్నారు.పదిరోజుల క్రితమే మహిళ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, తదుపరి విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకైతే సునీత ఎలా చనిపోయిందనే విషయంపై క్లారిటీ లేదు.

మరిన్ని వార్తలు