రూ.15 కోట్లు గల్లంతు: బ్యాంకు మేనేజర్‌ ఆత్మహత్య

11 Aug, 2021 11:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 రైతు రుణాల్లో రూ.15 కోట్లు గల్లంతు

ఉన్నతాధికారుల వేధింపులు 

సహకార బ్యాంకు మేనేజర్‌ ఆత్మహత్య

భోపాల్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే రుణాల్లో అక్రమాలు, ఉన్నతాధికారుల వేధింపులతో బ్యాంకు మేనేజర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా సహకార బ్యాంకు మక్డాన్ బ్రాంచ్ మేనేజర్ లాల్ సింగ్ కుశ్వాహా మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని చిమంగంజ్ మండీ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన  చోటు చేసుకుంది.

ఖండేల్వాల్ నగర్‌లోని తన ఇంట్లో కుశ్వాహా  ఉరి వేసుకుని చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఒక సూసైడ్‌నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బ్యాంకు ఎండీ విశేష్ శ్రీవాస్తవ, అసిస్టెంట్ మేనేజర్హే‌ మహేష్ కుమార్ మాథుర్ పేర్లను పేర్కొన్నాడు. తమ అక్రమాలకు, అవినీతికి సహకరించాలంటూ ఉన్నతాధికారులు తనను వేధించారంటూ ఆ లేఖలో పేర్కొనడం కలకలం రేపింది. మరోవైపు ఈ విషయంలో గత ఆరు నెలలుగా తండ్రి మానసిక వేదన అనుభవించాడని కుమారుడు నరేంద్ర చెప్పారు. బ్యాంకులో అవినీతికి పాల్పడటం ద్వారా తమకు డబ్బులు ఇవ్వమని ఎండీ,  ఇతర ఉన్నతోద్యోగుల నుంచి ఒత్తిడి ఉండేదని ఆరోపించారు.  

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సున్నా శాతం వడ్డీ రేటుతో రైతులకు ప్రభుత్వం పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి మక్డాన్ శాఖలో అక్రమాలు వెలుగు చూశాయి. మొత్తం ఎనిమిది ఏఈఎసిల ద్వారా రుణాల పంపిణీకి సంబంధించిన పోర్టల్‌లో అప్‌లోడ్ సబ్సిడీ షీట్‌లో సుమారు రూ .15 కోట్ల వరకు తేడా వచ్చింది.  దీనిపై పై అధికారులు వివరణ కోరారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, శ్రీవాస్తవ  కుశ్వాహాకు నోటీసులు జారీ చేశారు.  బహుశా ఈ విషయంలో అతను టెన్షన్‌ పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సూసైడ్‌నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టామనీ, విచారణ పూర్తయిన తర్వాత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు