రెప్పపాటులో విషాదం.. కరెంట్‌ షాక్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మరణం

11 Jul, 2021 15:49 IST|Sakshi

భోపాల్‌: అప్ప‌టిదాకా అంతా బాగానే ఉంది, చూ​స్తుండగానే రెప్పపాటులో ఆ ఇంట్లో ఒక్క‌సారిగా విషాదం అలుముకుంది. ఆ క్ష‌ణం వ‌ర‌కు ప్రాణాలతో కళకళలాడుతున్న ఆ కుటుంబంలోని స‌భ్యులంతా ఒకేసారి విగ‌త‌జీవులుగా మారారు. కరెంట్‌ షాక్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు ప్రాణాలు గాల్లో కలిసాయి. ఈ ఘోరం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతార్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీజావ‌ర్ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మహాజ్వాలా గ్రామంలో ఓ ఇంట్లో సెప్టిక్‌ ట్యాంక్‌ నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో ఆ ఇంట్లోని ఒకరు పైకప్పు స్లాబ్ వేయడానికి ఉపయోగించే షట్టర్ ప్లేట్లను తొలగించడానికి ట్యాంక్‌లోకి దిగారు. అయితే, ట్యాంక్‌లో లైటింగ్ ఏర్పాట్ల కారణంగా, కరెంట్‌ ఆ పలకలపైకి వ్యాపించడంతో ఆ వ్యక్తి కరెంట్‌ షాక్‌కు గురికాగా.. అతడిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఐదుగురు కుటుంబ సభ్యులు కూడా కరెంట్‌ షాక్‌కు గురయ్యారు. చికిత్స  కోసం వెంటనే ఆ ఆరుగురిని ఆస్పత్రికి తరలించగా, వారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా మృతులు 20 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు