జాతరలో ఇద్దరు అమ్మాయిలను అందరూ చూస్తుండగానే.. వీడియో వైరల్‌

13 Mar, 2022 18:56 IST|Sakshi

భోపాల్‌: దేశంలో మహిళలపై లైంగిక దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. కొందరు ఆకతాయిలు కావాలనే యువతులను, మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ పోకిరి గ్యాంగ్‌ మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఇద్దరు అమ్మాయిలను లైంగికంగా హింసించారు. వారు చేసేది చాలదన్నట్టుగా కొందరు వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీస్తూ రాక్షసానందం పొందారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. అలిరాజ్‌పూర్ జిల్లా సోండ్వా తెహసీల్‌లోని వాల్పూర్ గ్రామంలో హోలీకి ముందర అలిరాజ్‌పూర్, ఝాబువా, దర్, బర్వాని, సహా పశ్చిమ మధ్యప్రదేశ్‌లో గిరిజనుల జాతర భగోరియా జరుగుతుంది. గిరిజనులు నివాసం ఉండే ప్రాంతంలో ఈ జాతరను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జాతర ప్రారంభమైంది. కాగా, జాతరలో మార్చి 11వ తేదీన ఓ అభ్యంతరకర ఘటన చోటుచేసుకుంది. జాతరకు వచ్చిన ఓ గ్యాంగ్‌.. రోడ్డుపై అరుచుకుంటూ నానా బీభత్సం సృష్టిస్తూ వెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు గిరిజన అమ్మాయిలు భయంతో చాటుగా ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఓ పోకిరి ఒక అమ్మాయి వైపు పరుగెత్తి తన వైపు లాక్కున్నాడు. లైంగికంగా వేధించాడు.

అంతటితో ఆగకుంగా ఆ గ్యాంగ్‌లో మరో వ్యక్తి రెండో అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా వారి పట్ల దురుసుగా ప్రవర్తించి.. లైంగిక వేధింపులకు గురి చేశారు. వారి వేధింపులను చూస్తూ జాతరలో ఉన్న వారు ఆపడానికి ప్రయత్నించకపోగా.. తమ ఫోన్లతో వీడియోలు తీశారు. అనంతరం సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంలో వీడియో కాస్తా వైరల్‌ మారింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటన తమ దృష్టికి రాలేదని అలిరాజ్‌పూర్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. కానీ, ఈ వీడియో తీసిన గుర్తించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు