పాత కక్షలు.. తుపాకులతో వెళ్లి విధ్వంసం.. ఒకే కుటుంబంలో ఆరుగురు దారుణ హత్య..

5 May, 2023 15:56 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్ మొరేనా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పాత కక్షతో ఓ కుటుంబానికి చెందిన వారు తుపాకులతో వెళ్లి మరో కుటుంబంపై భీకర దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. 

లేప గ్రామంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ  ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తుపాకులతో ముఠాగా వెళ్లిన కొందరు.. బాధిత కుటుంబంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఎలాంటి భయం లేకుండా యథేచ్ఛగా పెద్ద పెద్ద తుపాకులు  తీసుకెళ్లి దాడి చేశారు.

అయితే ఈ రెండు కుటుంబాల మధ్య పాత వైరం ఉంది. 2013లో చెత్త పడేసే విషయంపై ధీర్ సింగ్ థోమర్, గజేంద్ర సింగ్ థోమర్ కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది.  ఈ హింసాత్మక ఘటనలో ధీర్‌ సింగ్‌ కుటుంబంలో ఇద్దరు చనిపోయారు.  ఆ తర్వాత గజేంద్ర కుటుంబం ఊరు విడిచి పారిపోయింది.

అయితే ఇరు కుటుంబాలు ఇటీవలే కోర్టు బయట రాజీ కుదుర్చుకున్నాయి. దీంతో గజేంద్ర సింగ్ థోమర్ ఫ్యామిలీ 10 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగివచ్చింది. వీరు ఇంటికి వచ్చిన కాసేపటికే పగతో రగిలిపోతున్న ధీర్ సింగ్ కుటుంబం దాడి చేసింది. మొదట కర్రలతో గజేంద్ర కుటంబసభ్యులను వీరు చితకబాదారు. ఆ తర్వాత తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో గజేంద్ర సింగ్ థోమర్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు, ముగ్గురు మహిళలు చనిపోయారు. పాత పగలే ఈ హత్యలకు కారణమని పోలీసులు స్పష్టం చేశారు. బంధువుల ఫిర్యాదు ఆధారంగా మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఐఈడీ పేల్చిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి..

మరిన్ని వార్తలు