‘సార్‌ అర్జంట్‌ ఒక ఫోన్‌ కాల్‌’.. ఫోన్‌ దొంగ వెంటపడి రైలు కింద నుజ్జయిన పెద్దాయన

17 May, 2022 16:08 IST|Sakshi

భోపాల్‌: ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని తెలియజేసే ఘటన ఇది. ఫోన్‌​ మాట్లాడుకుంటానని బతిమాలిన ఓ వ్యక్తి.. ఆపై దానితో పారిపోగా.. వెంబడిన ఫోన్‌ యజమాని రైలు కింద పడి నుజ్జు అయిన ఘటన ఇది. 

ఆదివారం రాత్రి సమయంలో.. మధ్యప్రదేశ్‌ షాదోల్ స్టేషన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. 54 ఏళ్ల ప్రైవేటు పాఠశాల టీచర్ మనోజ్‌ నేమా,  దుర్గ్‌-అజ్మీర్‌ రైలులో సాగర్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో.. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి అత్యవసరంగా ఫోన్‌ మాట్లాడుకోవాలంటూ ఫోన్‌ అడిగాడు. 

ఆయన ఫోన్‌ ఇవ్వగా.. షాదోల్‌ స్టేషన్‌ వద్దకు రాగానే రైలు స్లో అయ్యింది. ఇదే అదనుగా ఆ దుండగుడు ఫోన్‌తో పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో నేమా అతని వెంటపడ్డారు. ఈ క్రమంలో కాలు జారి పట్టాలపై పడిపోయి ఆయన్ని.. రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు.

ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు.. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. షాదోల్ జిల్లా ఖేరి గ్రామవాసి రాజేంద్ర సింగ్‌గా తేల్చి.. అతని నుంచి ఓ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు