కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో మహిళ ఆత్మహత్య

17 May, 2021 17:20 IST|Sakshi
కాంగ్రెస్ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ మాజీ మంత్రి ఉమాంగ్ సింఘర్ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

భోపాల్‌లో చోటు చేసుకున్న ఘటన

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నివాసంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతురాలు, ఎమ్మెల్యే జీవితంలో ఆమెకు స్థానం లభించనందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ మాజీ మంత్రి ఉమాంగ్ సింఘర్ భోపాల్‌ నివాసంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు సంఘటన స్థలం నుంచి సూసైడ్‌ నోట్‌ లభ్యం చేసుకున్నారు. దీనిలో ‘‘సింఘర్‌ జీవితంలో నాకు చోటు లేదని అర్థం అయ్యింది. అందుకే నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను’’ అని రాసి ఉందని తెలిపారు పోలీసులు. మృతురాలిని భోపాల్‌లోని షాపురా ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. ఏడాది కాలంగా ఆమెకు, సింఘర్‌కు పరిచయం ఉందని.. మృతురాలు తరచుగా ఎమ్మెల్యే నివాసానికి వస్తూ ఉండేదన్నారు. పైగా ఆమె  మరణించడానికి 25-30 రోజుల ముందు నుంచి ఎమ్మెల్యే నివాసంలోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రాజేష్‌ సింగ్‌ భదోరియా మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే భవనంలో ఓ పనిమనిషి, అతడి భార్య నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పనిమనిషి భార్య, మృతురాలు నిద్రిస్తున్న గది తలుపు తట్టి చూడగా.. ఎలాంటి స్పందన లేదు. దాంతో వెంటనే సర్వెంట్‌ ఈ విషయాన్ని సింఘర్‌కు తెలిపాడు. ఇక ఎమ్మెల్యే సూచనల మేరకు పనిమనిషి గదిలోకి వెళ్లి చూడగా.. అ‍క్కడ సదరు మహిళ వేలాడుతూ కనిపించింది’’ అన్నారు. 

సింఘర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది హృదయ విదారక సంఘటన. చనిపోయిన మహిళ నాకు మంచి స్నేహితురాలు. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. చికిత్స తీసుకుంటుందని నాకు తెలియదు. గత రెండు రోజులుగా నేను భోపాల్‌లో లేను. ఇక పోలీసులు ఆమె వద్ద నుంచి అంబాలా, భోపాల్‌ ఆస్పత్రులకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్లను కనుగొన్నారు. ఇక సదరు మహిళ అనారోగ్యం గురించి నాకు ముందే తెలిసి ఉంటే.. మంచి చికిత్స ఇప్పించేవాడిని. ఇలా జరగకుండా చూసేవాడిని’’ అని తెలిపారు. 

చదవండి: నా చావుతోనైనా కుటుంబానికి రక్షణ కల్పించండి

>
మరిన్ని వార్తలు