నకిలీ టీకాల కలకలం.. 2 వేల మందికి ఉప్పు నీటితో వ్యాక్సినేషన్‌?

25 Jun, 2021 18:54 IST|Sakshi

ముంబై: ఓ వైపు కరోనాతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే మరో వైపు కొందరు మాత్రం ఈ పరిస్థితులను క్యాష్‌ చేసుకుంటున్నారు. ముంబైలో నకిలీ వాక్సిన్‌ ఉదంతం బయటపడింది. నగరంలోని ఓ హౌజింగ్‌ సొసైటీలో సుమారు 300 పైగా వ్యాక్సిన్‌ తీసుకున్నాక ఏ లక్షణం లేకపోవడంతో అనుమానంతో ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి 10 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నగరంలో నకిలీ వ్యాక్సిన్లు..ఉప్పునీరు లేదా సెలైన్‌?
నిందితులు ప్రజలకు ఉప్పునీటి లేదా సెలైన్‌ను వ్యాక్సిన్‌గా ఇచ్చినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే నిందితుల దగ్గర నుంచి రూ.12.40 లక్షలు రికవరీ చేసి, ప్రధాన నిందితులైన మనీష్ త్రిపాఠి, మహేంద్ర సింగ్  బ్యాంకు ఖాతాలు బ్లాక్‌ చేశామని పోలీసులు తెలిపారు. నగరంలో 9 నకిలీ వ్యాక్సిన్‌ క్యాంపులు జరిగినట్లు తెలిపారు. కాగా ముంబైలోని కందివాలిలోని హౌసింగ్ సొసైటీ వారు ఫిర్యాదు చేయడంతో గత వారం ఈ కుంభకోణం బయట పడింది.

హిరానందాని హెరిటేజ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లోని నివాసితుల ప్రకారం.. నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సిబ్బందిమంటూ కొంతమంది వ్యాక్సిన్‌ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ  మోసానికి  పాల్పడినట్లు వారు చెప్తున్నారు. 

 "మాకు వాస్తవానికి కోవిషీల్డ్ ఇంజెక్ట్‌ చేశారా లేదా గ్లూకోజ్ అనే సందేహాలు ఉన్నాయని’ నివాసితులలో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నిర్మాత రమేష్ తౌరానీ కూడా ఇదే విధమైన ఫిర్యాదు చేశారు. తను మే 30, జూన్ 3 న 365 మంది ఉద్యోగులకు టీకా శిబిరం ఏర్పాటు చేశానని, అయితే ఎవరికీ ధృవీకరణ పత్రాలు రాలేదని తెలిపారు. కాగా పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. 2 వేల మందికి పైగా ప్రజలకు ఈ ముఠా నకిలీ వ్యాక్సిన్లు వేసినట్లు గుర్తించారు. 
చదవండి: భర్త ప్రశ్న.. భార్య ఆత్మహత్య

మరిన్ని వార్తలు