పూణె: వరకట్నం అడగడం చట్టప్రకారం నేరమని చెప్తున్నా అమ్మాయిలకి, వారి కుటుంబ సభ్యులకి ఈ సమస్య తప్పట్లేదు. ఇప్పటికీ వరకట్న ఆత్మహత్యలు, వేధింపులు అప్పుడప్పుడు మనం వార్తల్లో వింటూనే ఉంటాం. సాధారణంగా వరకట్నం అంటే ఆస్తులు, డబ్బులు అడుగుతుంటారు. అయితే వెరైటీ కోరికలు కోరి వరకట్నంగా తీర్చమన్నారు ఓ కుటుంబ సభ్యలు. చివరికి కుటుంబమంతా కటకటలాపాలయ్యారు. ఈ ఘటన మహరాష్ట్రలోని ఔరంగాబాద్లో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 10న రామనగర్ ప్రాంతంలోని ఒక హాలులో ఓ జంటకు నిశ్చితార్థం అయ్యింది. యువతి కుటుంబం నిశ్చితార్థానికి ముందే 2 లక్షల నగదు, 10 గ్రాముల బంగారం వరకట్నంగా ఇచ్చారు. అయితే, నిశ్చితార్థం తరువాత అబ్బాయి కుటుంబ సభ్యులు వారి వింత కోరికల జాబితాను బయట పెట్టారు. ఆ లిస్ట్ చూస్తే ఇలాంటివి కూడా అడుగుతారా అనిపించేలా ఉన్నాయి. అందులో 21 గోర్లు గల తాబేళ్లు, ఒక నల్ల లాబ్రడార్ కుక్క, ఒక బుద్ధ విగ్రహం, సమై లాంప్స్టాండ్, రూ.10 లక్షలు ఇవ్వాలంటూ యువతి కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఇవి ఇస్తేనే వివాహం తర్వాత ఉద్యోగం వస్తుందని వాళ్లని నమ్మించారు. అనంతరం యువతి కుటుంబం ఈ కోరికలను తీర్చలేకపోవడంతో ఈ పెళ్లిని వరుడి కుటుంబసభ్యులు రద్దు చేశారు. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో వారిని అరెస్టు చేశారు.