ఇద్దరు భార్యలు పట్టించుకోవట్లేదని కిడ్నాప్ డ్రామా.. అత్త మీద తోసేద్దామని.. చివరకు..

21 Oct, 2022 19:06 IST|Sakshi

ముంబై: ఇద్దరు భార్యలున్నా తనను పట్టించుకోవట్లేదని సూపర్ ప్లాన్ వేశాడు ఓ భర్త. తాను కన్పించకపోతే వాళ్లే వెతుక్కుంటూ వస్తారని భావించాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి పక్కా స్కెచ్‌తో కిడ్నాప్ డ్రామా ఆడాడు. అంతా పథకం ప్రకారమే జరిగినప్పటికీ పోలీసులు రంగంలోకి దిగడంతో దొరికిపోయాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్ర  ఠాణెలోని కల్యాణ్‌లో ఈ ఘటన జరిగింది.

వివారాల్లోకి వెళ్తే.. కిడ్నాప్ డ్రామా ఆడిన వ్యక్తి పేరు సందీప్ గైక్వాడ్. మొదటి పెళ్లి విషయం దాచి సునీత గైక్వాడ్‌ను గుడిలో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇద్దరు భార్యలు ఇతడ్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు. మొదటి భార్య దూరంగా ఉంటోంది. అయితే అక్టోబర్ 14న సునీతతో కలిసి దిలీప్ ఓ రోడ్డుపై స్కూటీని పార్కు చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి అతడ్ని కొట్టి తీసుకెళ్లారు. దీంతో వెంటనే సునీత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. నాలుగు రోజుల తర్వాత ఆ  ఆటో ఎక్కడుందో ట్రేస్ చేశారు. దిలీప్‌ను, అతనిపాటు ఉన్న మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే విచారణలో సునీత తల్లే.. దిలీప్‌ను కిడ్నాప్ చేయమని చెప్పిందని, అతడ్ని తన బిడ్డ నుంచి దూరం చేయాలనే ఇందంతా చేసిందని ముగ్గురూ చెప్పారు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి కచ్చితమైన వివరాలతో మరోసారి విచారించగా అప్పుడు అసలు నిజాన్ని ఒప్పుకున్నారు నిందితులు. తామంతా స్నేహితులమని, దీలిప్ తన భార్యల సింపతీ కోసమే ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు చెప్పారు. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.
చదవండి: రూల్‌ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్‌ అయినా తప్పదు జరిమానా!

మరిన్ని వార్తలు