ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. భార్య కడుపు కోసి

22 Sep, 2020 10:26 IST|Sakshi

లక్నో: ఎన్ని శతాబ్దాలు గడిచినా.. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. ఆడ పిల్లపై చిన్న చూపు మాత్రం పోవడం లేదు. అవసాన దశలో కొడుకులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో తెలిపే ఘటనలు ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. అయినా మార్పు రాదు. నేటికి కొందరు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడ పిల్ల అయితే అబార్షన్‌లు చేపిస్తున్నారు. ఎంత కఠిన చట్టాలు వచ్చినా పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య గర్భంలో ఉంది ఆడపిల్లో, మగ పిల్లాడో తెలుసుకునేందుకు ఏకంగా ఆమె పొట్టని చీల్చాడు. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుదాన్‌లో చోటు చేసుకుంది. పన్నాలాల్ అనే వ్యక్తికి ఇప్పటికే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకును కనాలనేది అతడి కోరిక. ఈ క్రమంలో అతడి భార్య మరోసారి గర్భవతి అయింది. ఈసారి కూడా ఆడపిల్ల పుడితే ఎలాగని ఆందోళన చెందిన పన్నాలాల్ విపరీత చర్యకు దిగాడు. (చదవండి: కొట్టి చంపి.. గోతంలో వేసి..!)

పొట్టలో ఉంది ఆడో, మగో తెలుసుకునేందుకు కొడవలితో భార్య పొట్ట చీల్చాడు. భర్త విపరీత చర్యకు ఆ గర్భవతి తల్లడిల్లిపోయింది. తీవ్ర రక్తస్త్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్థానికులు ఆమెను బరేలీలోని ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు పుట్టాలని కోరుకుంటున్న పన్నాలాల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు పన్నాలాల్‌ను అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు