Tamil Nadu Crime: సుమతితో వివాహేతర సంబంధం.. బయటకు తెలిసి..

13 Sep, 2022 17:15 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

తిరువొత్తియూరు (చెన్నై): కోత్తగిరిలో 45 రోజులకు ముందు అదృశ్యమైన వివాహేతర జంట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతదేహాలుగా కనిపించారు. వివరాలు.. నీలగిరి జిల్లా కోత్తగిరి సమీపంలోని వెల్లెరి కొల్లంకు చెందిన శరవణన్‌ (25). అతనికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు.

అయితే పొన్నూరు సాపంకరై గ్రామానికి చెందిన సుమతి (23)తో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి సంబంధం బయటకు తెలియడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో గత 45 రోజులకు ముందు ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. బంధువులు వారి కోసం గాలించినప్పటికీ ఆచూకీ తెలియ రాలేదు. ఈ క్రమంలో ఆదివారం వెల్లేరికొల్లం అటవీ ప్రాంతంలో ప్రజలు వెళుతున్న సమయంలో కుళ్ళిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.

వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వారి ఆధార్‌ కార్డు, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. మృతదేహాల వద్ద లభించిన చీటీలో ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. పేర్కొనబడి ఉంది. అనంతరం మృతదేహాలను కోత్తగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతదేహాలు శరవనన్, సుమతివి అని నిర్ధారించారు.  

చదవండి: (చిత్ర పరిశ్రమలో కలకలం.. సినీ దర్శకుడిపై ఫిర్యాదు)

మరిన్ని వార్తలు