80 మందిని రూ.8 కోట్లకు ముంచాడు

21 Feb, 2021 19:55 IST|Sakshi

ఢిల్లీ: మోసపూరిత పెట్టుబడి పథకాల పేరుతో 80 మందికి పైగా వ్యక్తుల వద్ద రూ.8 కోట్ల మేర మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. 41ఏళ్ల గోపాల్‌ దళపతి, వైర్డ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, వైర్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నాడు. తమ సంస్థ పోంజీ పథకాల్లో పెట్టుబడిపెడితే అధిక డబ్బును తిరిగి పొందవచ్చని 80 మందికి పైగా ప్రజలను నమ్మించాడు. హామీ కోసం సంస్థ డిబెంచర్ సర్టిఫికేట్లను వారికి ఇచ్చాడు.

ఇలా సుమారు రూ.8 కోట్ల మేర డబ్బులు సేకరించాడు. మూడేండ్ల కిందట ఢిల్లీ, కోల్‌కతాలోని కార్యాలయాలను మూసివేసి అదృశ్యమయ్యాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాల్‌ అనుచరులైన అమరేంద్ర ప్రసాద్ సింగ్, భారత్ కుమార్, సంజయ్ కుమార్ దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే సంస్థ డైరెక్టరైన గోపాల్‌ దళపతి తరచుగా వేషాలు, అడ్రస్‌లు మారుస్తూ 3ఏళ్ల నుంచి పోలీసుల కళ్లుగప్పుతున్నాడు. అప్పటినుంచి గోపాల్‌ కోసం గాలిస్తున్న ఆర్థిక నేరాల విభాగం బృందం ఎట్టకేలకు సాకేత్ కోర్ట్ కాంప్లెక్స్ సమీపంలో గుర్తించి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 
చదవండి: చచ్చిపోదామనుకున్నాడు.. మనసు మార్చుకుని
‘పెళ్లి లేదు, ఏమీ లేదు.. పో!’

మరిన్ని వార్తలు