మహిళలే టార్గెట్‌గా మోసాలు 

28 Mar, 2021 16:04 IST|Sakshi
ఎస్పీ కార్యాలయంలో వివరాలు తెలియచేస్తున్న ఎస్పీ నాయక్, చిత్రంలో డీఎస్పీ దిలీప్‌ కిరణ్‌  

20 కేసుల్లో నిందితుడి అరెస్టు

223 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ

ఏలూరు టౌన్(పశ్చిమగోదావరి)‌: మహిళలతో పరిచయాలు పెంచుకుంటాడు... ఆయుర్వేద డాక్టర్, ఫైనాన్స్‌ వ్యాపారం, బిజినెస్‌ అంటూ మాయమాటలు చెప్పి మహిళలకు మత్తు బిళ్ళలు ఇచ్చి వారినుంచి బంగారు అభరణాలు, నగదు కాజేస్తుంటాడు. లక్షలు దోచుకోవడం, జల్సాలు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నాడు చేపూరు చంద్రబాబు అలియాస్‌ శేఖర్‌ రెడ్డి అలియాస్‌ వంశీకృష్ణ. ఏలూరులో ఇదే తరహాలో మోసానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఏలూరులోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం ఎస్పీ కే.నారాయణ నాయక్‌ వివరాలు వెల్లడించారు.

నెల్లూరు జిల్లా కోట మండలం శ్యాంసుందరపురానికి చెందిన చేపూరు చంద్రబాబు పలు మోసాలకు పాల్పడేవాడు. రియల్‌ ఎస్టేట్, బిజినెన్స్, ఫైనాన్స్, ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ అని పరిచయం చేసుకుని మహిళల నగలు, నగదును కాజేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. తాను దొరికిపోకుండా ఆధార్‌కార్డులు నకిలీవి తయారు చేసుకుని వాటిని వినియోగించేవాడు. ఒక్కొక్కకరికి ఒక్కో సిమ్‌ వాడడం అతని ప్రత్యేకత. గత కొన్నేళ్ళుగా నెల్లూరు, తిరుపతి, నాయుడుపేట, గుంటూరు, కృష్ణాజిల్లాలోనూ అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఇంతవరకూ సుమారుగా 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉండటమే కాదు, శిక్షలు కూడా అనుభవించాడు. నెల్లూరు జిల్లా కోట పోలీస్‌స్టేషన్‌లో డీసీ షీట్‌ కూడా తెరిచారు.

చోరీ సొత్తు విలువ రూ.9 లక్షలపైనే 
టూటౌన్‌ స్టేషన్‌ పరిధిలోని తంగెళ్ళమూడి ఎంఆర్‌సీ కాలనీకి చెందిన మహిళ, కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన ఒక మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఏలూరు తంగెళ్ళమూడికి చెందిన మహిళను మోసం చేసిన కేసులో 60.30 గ్రాములు బంగారు ఆభరణాలు, గన్నవరానికి చెందిన మహిళ కేసులో 40.83 గ్రాములు బంగారు ఆభరణాలు, నరసరావుపేటలో నమోదైన కేసులో 74.43 గ్రాముల బంగారం, కృష్ణా జిల్లా వీరవల్లి స్టేషన్‌లో నమోదైన కేసులో 47.48 గ్రాముల బంగారుం స్వా«దీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 9 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ పర్యవేక్షణలో టూటౌన్‌ సీఐ ఆదిప్రసాద్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిందితుడు చేకూరి చంద్రబాబును అరెస్టు చేశారు. కేసును చేదించడంలో సహకరించిన పోలీస్‌ సిబ్బంది రాజేష్‌, సూర్యనారాయణలను ఎస్పీ అభినందించి బహుమతి అందించారు. దర్యాప్తులో ఎస్సైలు ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు, నాగబాబు ఉన్నారు.
చదవండి:
మగవాళ్లు ఆడవాళ్లుగా.. హోలీ సంబరాల్లో వింత ఆచారం       
రాజమహేంద్రవరంలో ‘టక్‌ జగదీష్‌’

మరిన్ని వార్తలు