బస్సులో బాలికపై అమానుషం

22 Sep, 2021 16:06 IST|Sakshi

ఫిరోజాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఔరియాకు స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ బాలికపై బస్సు సిబ్బందే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో బస్సుల్లో రాత్రి సమయాల్లో మహిళలు ఒంటరిగా ప్రయాణించాలంటే భయపడే పరిస్థితితో పాటు వారి భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందే చెప్పాలి. 

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షికోహాబాద్ కొత్వాలీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె (15), మేనకోడలుతో కలిసి ఢిల్లీ, బదర్‌పూర్ సరిహద్దు నుంచి స్లీపర్‌ బస్సులో షికోహాబాద్‌కు వెళ్తోంది. బస్సు నోయిడా, ఆగ్రా మధ్యమార్గంలో కొద్దిసేపు ఆపారు. ఆ సమయంలో అందరూ బస్సు దిగగా బాలిక సీటులోనే ఉండిపోయింది. ఒంటరిగా ఉన్న బాలికను చూసి బస్సు సిబ్బంది బబ్లూ, ఆషు అత్యాచారానికి పాల్పడ్డారు. కాసేపటి తర్వాత బాధితురాలి తల్లి బస్సులోకి వచ్చి కుమార్తె కోసం చూడగా సీటులో కనిపించలేదు.

దీంతో కంగారుతో వెతుకుతుండగా మరో క్యాబిన్‌లో కుమార్తె ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని రోదిస్తూ చెప్పింది బాలిక. బస్సును ఆపాలని.. వాళ్లిద్దరినీ పోలీసులకు అప్పగించాలని బాధితురాలి తల్లి ఎంత చెప్పినా డ్రైవర్ బస్సు ఆపలేదు. ఆమెతో పాటు తోటి ప్రయాణికులు కూడా బస్సు ఆపాలని కేకలేయడంతో చివరకు ఆపాడు. కానీ ఈలోపే నిందితులలో ఒకడైన అషు అలీగఢ్‌లోని టప్పల్ దగ్గర దిగిపోగా, కొంతదూరం వెళ్లాక మరో నిందితుడు బబ్లూ కూడా మధురలోని నౌజీల్ వద్ద బస్సు దిగాడు.

మరుసటి రోజు ఉదయం 7 గంటలకు షికోహాబాద్ చేరుకున్న తర్వాత జరిగిన విషయాన్ని పోలీసులకు బాధితురాలి తల్లి తెలిపింది. బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌తో  బస్సును తనిఖీ చేశారు. ఈ మేరకు అషును పోలీసులు అరెస్ట్ చేయగా, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

చదవండి: Vikarabad: రెచ్చిపోయిన సర్పంచ్‌.. సామాన్యుడిని కాలితో తంతూ..

మరిన్ని వార్తలు