విద్వేషపూరిత పోస్టింగ్‌లు.. మానవ బాంబునై సీఎంను చంపేస్తా..! 

22 Jan, 2022 08:33 IST|Sakshi

ట్విట్టర్‌లో నిందితుడి విద్వేషపూరిత పోస్టింగ్‌లు

నిందితుడు జనసేన సానుభూతిపరుడిగా గుర్తింపు 

సాక్షి ప్రతినిధి, గుంటూరు: మానవ బాంబుగా మారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అంతమొందిస్తానంటూ ట్విట్టర్‌లో హెచ్చరిక పోస్టింగ్‌లు చేసిన ఓ నిందితుడిని సీఐడీ సైబర్‌ క్రైమ్స్‌ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరానికి చెందిన రాజుపాలెపు పవన్‌ఫణి అనే వ్యక్తి కన్నాభాయ్‌ అనే ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా ఈ పోస్టింగ్‌లు చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సేల్స్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న నిందితుడు జనసేన మద్దతుదారుడినని, పవన్‌కళ్యాణ్‌ వీరాభిమానని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ఎస్పీ రాధిక తెలిపారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

చదవండి: టీడీపీ నేత వర్ల రామయ్యకు ఐపీఎస్‌ అధికారుల సంఘం హెచ్చరిక

టెక్నాలజీతో గుర్తించిన సీఐడీ 
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ద్వేషంతో ఆయన్ను చంపాలంటూ ఈ నెల 16న ట్వీట్‌ చేసిన నిందితుడు అదేరోజు రాత్రి దాన్ని తొలగించాడు. ట్విట్టర్‌ అకౌంట్‌ను కూడా డిలీట్‌ చేశాడు. ఫోన్‌ స్విచ్ఛ్‌ ఆఫ్‌ చేసి ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సీఐడీ సైబర్‌ నేరాల విభాగం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితుడు ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకుంది. ముఖ్యమంత్రిని హతమారిస్తే ప్రభుత్వం కూలిపోతుందని విద్వేషపూరిత పోస్టులు పెట్టినట్లు నిందితుడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరు.. 
అభ్యంతరకర, అశ్లీల, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చట్ట వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్టు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ విభాగం హెచ్చరించింది. తప్పుడు ఖాతాల ద్వారా పోస్టింగ్‌లు చేసి ఆ తర్వాత డిలీట్‌ చేసినా నిందితులు తప్పించుకోలేరని హెచ్చరించింది. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చేసేముందు జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించింది.

సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిని తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని జనసేన మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రిని చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తితో తమ పారీ్టకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. హింస, అశాంతి రేకెత్తించే వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తున్నట్లు తెలిపింది.   

మరిన్ని వార్తలు