భార్యను బూతులు తిట్టాడని: ఫ్రెండ్‌ బాడీని..

19 Dec, 2020 16:55 IST|Sakshi
మృతుడు సుశీల్‌ కుమార్‌ సర్‌నాయక్‌

ముంబై : భార్యను బూతులు తిట్టాడన్న కోపంతో స్నేహితుడ్ని హత్య చేశాడో వ్యక్తి. అనంతరం అతడి మృతదేహాన్ని 10 ముక్కలుగా చేసి మురికి కాల్వలో పడేశాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుశీల్‌ కుమార్‌ సర్‌నాయక్‌ అనే బ్యాంకు ఉద్యోగి ముంబై, వోర్లీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్నాడు. గత శనివారం స్నేహితుడ్ని కలవటానికి విరార్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బుధవారం నేరల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని మురికి కాల్వలో పడి ఉన్న ఓ బ్యాగులో మనిషి శరీర భాగాలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విడి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీసీ టీవీ ఫొటేజీలను పరిశీలించి చూడగా నాడార్‌ అనే వ్యక్తి బ్యాగులను మోసుకెళుతూ కనిపించాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతడే నేరం చేసినట్లు అంగీకరించాడు. ( ఈవెంట్ డ్యాన్సర్ అనుమానాస్పద మృతి )

భార్యను బూతులు తిట్టాడని..
శనివారం ఇంటినుంచి బయటకు వెళ్లిన సుశీల్‌.. విరార్‌కు కాకుండా నేరల్‌లోని మిత్రుడు చార్లెస్‌ నాడార్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫుల్లుగా మందుకొట్టారు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న సుశీల్‌.. నాడార్‌ భార్యను బూతులు తిట్టాడు. భార్యను అసహ్యంగా తిట్టడం సహించలేకపోయిన నాడార్‌ అతడ్ని చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని 10 ముక్కలు చేసి, బ్యాగుల్లో నింపి నేరల్‌ రైల్వే స్టేషన్‌కు దగ్గరలోని మురికి కాల్వలో పడేశాడు.

మరిన్ని వార్తలు