బావ గొంతుకోసిన బావమరిది: అందుకే చంపేశానంటూ

16 Apr, 2021 12:33 IST|Sakshi

హసన్‌పర్తి : వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు శివారులోని సుభాష్‌నగర్‌ సమీపంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సొంత బావమరిదే మద్యం బాటిల్‌తో గొంతుపై పొడవడంతో బలమైన గాయాలతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. హసన్‌పర్తికి చెందిన మోతె చందు(26), పస్తం అయి కుమార్‌ సొంత బావ బావమరుదులు. స్థానికంగా బియ్యం వ్యాపారం చేసే చందు వద్ద అయికుమార్‌ సహాయకుడిగా ఉంటున్నాడు. ఈక్రమంలో ఇద్దరు కలిసి కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని చింతగట్టుకు గురువారం వచ్చి మద్యం తాగారు. ఈ క్రమంలో ఇరువురి నడుమ ఘర్షణ జరగగా, అక్కడ బెల్ట్‌ షాపు వద్ద ఉన్న మద్యం బాటిల్‌ పగులగొట్టి చందుపై అయికుమార్‌ దాడి చేయగా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డి, ఎస్సై చంద్రమోహన్‌ చేరుకుని వివరాలు ఆరా తీశారు.

హత్య చేశాక అక్కడే..
చందును హత్య చేశాక నిందితుడు కుమార్‌ అక్కడే ఉన్నాడు. కుటుంబ సమస్యల కారణంగా మాటమాట పెరిగిందని చెప్పుకొచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఓ వివాహితతో సంబంధం కొనసాగిస్తున్నట్లు కుమార్‌పై చందు ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో గొడవ జరగగా, మద్యం మత్తుతో పాటు గంజాయి సేవించిన ఆయన హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇక చందును హత్య చేసేందుకు తమతో పడని వారే కుమార్‌కు డబ్బు ఇచ్చి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపించడం గమనార్హం.


చదవండి: వివాహేతర సంబంధం: మత్తుకు బానిసై కన్నతండ్రే..

మరిన్ని వార్తలు