వివాహేతర సంబంధం: అన్న మెడకు టవల్‌ చుట్టి.. 

29 May, 2022 15:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అన్నను తమ్ముడు మట్టుబెట్టినట్లు నిర్ధారణ అయ్యిందని, నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్‌ తరలించినట్లు ఏఎస్పీ రషీద్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ అన్నారు. శనివారం కొడంగల్‌లోని హైవే పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉన్న సీఐ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బొంరాస్‌పేట మండలం ఏర్పుమల్ల గ్రామంలో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సొంత అన్నను తమ్ముడు హత్య చేశాడని తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితుడిని శనివారం రిమాండ్‌కు తరలించారు. తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

ఏర్పుమల్ల గ్రామానికి చెందిన పూజారి గోపాల్, పూజారి శ్రీను అన్నదమ్ములు. పూజారి శ్రీను భార్యతో తన అన్నకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దీంతో గత ఏడాది నవంబర్‌ 15న  గోపాల్‌ గొంతును టవాల్‌తో బిగించి చంపాడు. ఇతరులకు అనుమానం రాకుండా మృతదేహాన్ని ఊరు చివర ఉన్న దోసలకుంట (నీటి కుంట)లో పడేశాడు. రెండు రోజుల తర్వాత శవం పైకి తేలడంతో మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు పూజారి శ్రీను నిందితుడిగా గుర్తించారు.

శనివారం రోజు రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఏఎస్పీ రషీద్‌ మాట్లాడుతూ  సమాజంలో వివాహేతర సంబంధాలే హత్యలకు దారి తీస్తున్నాయని అన్నారు. అవి మంచివి కావన్నారు. ఏదో ఒకరోజు విషయం తెలిసి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. ప్రాణాలు తీసిన వ్యక్తి జైలుకు వెళ్లక తప్పదన్నారు. దీని వల్ల రెండు కుటుంబాల వారు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో కొడంగల్‌ సీఐ ఇప్తికార్‌ అహ్మద్, కొడంగల్‌ ఎస్‌ఐ రవి పాల్గొన్నారు.  
చదవండి: Tequila Pub: పబ్‌పై రైడ్స్‌.. పోలీసుల అదుపులో డ్యాన్సింగ్‌ గర్ల్స్‌, కస్టమర్లు

మరిన్ని వార్తలు