సాక్షి, గచ్చిబౌలి: మణికొండలోని బోటిక్ నిర్వహిస్తున్న యువకుడిని కిడ్నాప్ చేసి మొయినాబాద్ పీఎస్ పరిధిలోని నక్కలపల్లిలో హత్య చేసిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం సీఐ రవీందర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎండీలైన్స్ టోలీచౌకీ ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్(25) మణికొండ, షిరిడీ సాయి కాలనీలో బోటిక్ నిర్వహిస్తున్నాడు. అతని సోదరుడు రిజ్వాన్ హఫీజ్పేట్లోని ఓ బట్టల దుకాణంలో సేల్స్మెన్గా పని చేస్తున్నాడు. ప్రతి రోజు సల్మాన్ తమ్ముడిని ఉదయం షాపు దగ్గర వదిలి రాత్రి ఇంటికి తీసుకెళ్లేవాడు. గత నెల 29న రాత్రి సల్మాన్ తమ్ముడికి ఫోన్ చేసి హఫీజ్పేట్కు వస్తున్నట్లు చెప్పాడు. అయితే అతను రాకపోవడంతో మణికొండకు వెళ్లి చూడగా షాపు మూసి వేసి ఉంది. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో 30న రాయదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా బైక్పై వెళుతున్న సల్మాన్ను గుర్తుతెలియని వ్యక్తులు అటకాయించి కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు.
ఈ నేపథ్యంలో సల్మాన్ బావమరిది దస్తగిరిని అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు తెలిపారు. సల్మాన్ను కిడ్నాప్ చేసి క్వాలీస్లో తీసుకెళ్లామని, కారులోనే బైక్ క్లచ్ వైరు మెడకు బిగించి హత్య చేసి నక్కలపల్లి శివార్లలోని చెరువు వద్ద పారవేసినట్లు తెలిపాడు. ఆదివారం సల్మాన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 2019 డిసెంబర్లో సల్మాన్కు పర్హానాతో వివాహం జరిగింది. గత కొన్ని నెలలుగా భార్యను వేధిస్తుండటంతో ఇరు కుటుంబాల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. దీంతో పర్హానా మూడు నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. దీనిని జీర్ణించుకోలేని పర్హానా తండ్రి జిలానీ అల్లుడి హత్యకు పథకం పన్నాడు. తన సమీప బంధువు దస్తగిరి, మరికొందరితో కలిసి సల్మాన్ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. కాగా ఈ కేసుతో ప్రమేయం ఉన్న వారి వివరాలు వెల్లడికావాల్సి ఉందని సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.