యువకుడ్ని కాల్చి చంపిన దుండగులు

28 Jun, 2021 21:13 IST|Sakshi

లక్నో : ఎంగేజ్‌మెంట్‌కు కొన్ని గంటల ముందు ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  ఉత్తరప్రదేశ్‌ ఫిరోజాబాద్‌కు చెందిన పవన్‌ కుమార్‌ కూరగాయల వ్యాపారస్తుడు. ఆదివారం ఉదయం 4.30 గంటల ప్రాంతంలో మండి సమితిలోని తన షాపునకు బైక్‌పై బయలుదేరాడు. మార్గం మధ్యలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు అత్యంత దగ్గరినుంచి తుపాకితో కుమార్‌పై కాల్పులు జరిపారు. అతడు బైక్‌పైనుంచి కిందపడ్డాడు. నిందితులు అక్కడినుంచి పారిపోయారు.

తీవ్రగాయాలపాలైన కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, మృతుడి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ఆశోక్‌ కుమార్‌ హత్యకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఫొటేజీలను పరిశీలించారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు. దగ్గరి బంధువే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

కుటుంబానికి అతడే దిక్కు... ఇంటికి పెద్ద కుమారుడైన కుమార్‌ మీద తమ కుటుంబం ఆధారపడి ఉందని అతడి తండ్రి దివాకర్‌ సింగ్‌ తెలిపారు. కుమార్‌ పెళ్లి జరగబోతోందని ఎంతో సంతోషపడ్డామన్నారు. ఆదివారం అతడికి నిశ్చితార్థం జరగనుండగా.. కుటుంబం మొత్తం కలిసి శనివారం సాయంత్రం ఆ పనులు చేసుకున్నామని చెప్పారు. 

నా కుమారుడికి శత్రువులెవరూ లేరు... ‘‘ హత్య జరగటానికి ముందురాత్రి.. షాపునకు వెళ్లొద్దని ఇంట్లో ఉండి నిశ్చితార్థం పనులు చూసుకోమని చెప్పాను. కానీ, ప్రతీ రోజూలాగే ఉదయం నాలుగు గంటలకు మండిలోని షాపునకు బయలుదేరాడు. ఎనిమిది కల్లా తిరిగొస్తానన్నాడు. రాలేదు. అతడు చనిపోయాడనే వార్త తెలిసింది. నాకు తెలిసినంత వరకు కుమార్‌కు ఎవరూ శత్రువులు లేరు’’ అని అన్నాడు.

మరిన్ని వార్తలు