కారుతో ఢీ కొట్టి.. ఆపై గొడ్డలితో నరికి

4 Mar, 2021 17:55 IST|Sakshi

నాగర్‌కర్నూల్‌: ఆస్తి కోసం తోడబుట్టిన అన్ననే కారుతో ఢీకొట్టి.. ఆపై గొడ్డలితో దారుణంగా నరికి చంపిన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం అనేఖాన్‌పల్లి తండాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. తండాకు చెందిన బాదావత్‌ హనుమంతు (40), బాదావత్‌ శంకర్‌ అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇదే క్రమంలో మంగళవారం మరోమారు ఆస్తి విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో ప్రాణాలైనా తీసేందుకు సిద్ధమని, ఆస్తి మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని తమ్ముడు శంకర్‌ హెచ్చరించాడు. ‘నీ చేతనైన పని చేసుకో’ అని అన్న హనుమంతు బదులిచ్చాడు.

దీంతో అన్నను ఎలాగైనా హతమార్చాలనుకున్న తమ్ముడు సమయం కోసం ఎదురుచూశాడు. బుధవారం హనుమంతు వ్యక్తిగత పనులపై వట్టెం గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై బయల్దేరాడు. ఈ విషయం తెలుసుకున్న తమ్ముడు శంకర్‌ మార్గమధ్యలో బైక్‌ను కారుతో ఢీకొట్టాడు. దీంతో కిందపడిన అన్నను గొడ్డలితో తల, కాలిపై నరికి హతమార్చాడు. మృతుడికి భార్య యామిని, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంఘటనపై ఎస్‌ఐ వెంకటేష్‌ని వివరణ కోరగా.. హత్య జరిగిన మాట వాస్తవమేనని, దీనిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.

చదవండి: మహిళతో రెడ్‌ హ్యండెడ్‌గా దొరికాడు.. భార్య నగలన్నీ ఆమెకు

మరిన్ని వార్తలు