Shamshabad: నీ అంతు చూస్తా అన్నందుకు.. ఒక్కసారిగా కత్తి తీసుకుని సొంత తమ్ముడే

1 Nov, 2021 07:52 IST|Sakshi
శ్రీనివాస్‌ (ఫైల్‌) 

చిన్నపాటి వివాదంతో దారుణ హత్య 

అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు  

సాక్షి, శంషాబాద్‌: పాత కక్షలకు తోడు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న వివాదం హత్యకు దారితీసింది. మండలంలోని తొండుపల్లి శివారులో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన గండికోట యాదయ్య (29), శ్రీనివాస్‌ అన్నదమ్ములు. వీరిద్దరూ కొంపల్లిలో ఉన్న ఆరెంజ్‌ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం శ్రీనివాస్‌ కొంపల్లి నుంచి గూడ్సు వాహనం తీసుకుని చెన్నై బయలుదేరాడు.
చదవండి: గట్టుపై బిడ్డను కూర్చోమని చెప్పి.. కుమార్తె కళ్లెదుటే..

ఈ వాహనంలో ఇతనితో పాటు వారి గ్రామానికి చెందిన మరో ముగ్గురు కూడా ఉన్నారు. వీరు అదే ట్రాన్స్‌పోర్టు కంపెనీలో పని చేస్తుండగా.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి ఈ వాహనంలో ఎక్కారు. అన్నదమ్ములిద్దరూ ఈ వాహనంలో ఒకరి తర్వాత ఒకరు డ్యూటీలో చేరుతారు. ఈ క్రమంలో వాహనం రాత్రి 8 గంటల సమయంలో మండలంలోని తొండుపల్లి వద్దకు చేరుకుంది. అక్కడకు శ్రీనివాస్‌ అన్న యాదయ్య వచ్చాడు. ఇప్పటి నుంచి తాను డ్యూటీ చేస్తానని తమ్ముడు శ్రీనివాస్‌కు చెప్పాడు.
చదవండి: ఆసిఫాబాద్‌లో పులి చర్మం స్వాధీనం

ఇందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో యాదయ్య బెదిరింపు ధోరణితో నీ అంతు చూస్తానని తమ్ముడు శ్రీనివాస్‌తో అన్నాడు. వెంటనే శ్రీనివాస్‌ స్థానిక పోలీసులకు ఫోన్‌ చేసి.. తనను చంపుతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఇద్దరు కూడా అన్నదమ్ములే కదా.. చిన్న దానికి గొడవ ఎందుకు అని సర్ది చెప్పి వెళ్లిపోయారు.  


స్టీరింగ్‌పైనే కుప్పకూలిన యాదయ్య, శ్రీనివాస్‌ (ఫైల్‌) 

కత్తితో దాడి చేసి.. 
తొండుపల్లి నుంచి యాదయ్య వాహనం నడుపుతుండగా.. అదే వాహనంలో శ్రీనివాస్‌తో పాటు మరో ముగ్గురు కూర్చున్నారు. యాదయ్య పక్కన ఓ వ్యక్తి కూర్చోగా.. తర్వాత శ్రీనివాస్‌ ఉన్నాడు. వాహనం బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి నుంచి రైల్వే వంతెన దాటగానే.. శ్రీనివాస్‌ ఒక్కసారిగా కత్తి తీసుకుని యాదయ్య ఛాతీలో పొడిచాడు. దీంతో అతను స్టీరింగ్‌పై స్పృహతప్పి పడిపోయాడు. ఈ సమయంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.

తీవ్ర గాయాలైన యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు