సైకో భర్త ఘాతుకం.. ఇద్దరు భార్యలను.. 

16 May, 2021 04:29 IST|Sakshi

మొదటి భార్య శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చేశాడు 

రెండవ భార్య హత్య కేసు విచారణలో వెలుగులోకి.. 

సాక్షి, పర్వతగిరి: వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని ఏనుగల్లుకు చెందిన వ్యక్తి తొలుత ఒక మహిళను పెళ్లి చేసుకుని హత్య చేశాడు. ఆ తర్వాత మరొక మహిళను పెళ్లాడి ఆమెను కూడా చంపేశాడు. రెండో భార్య కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు చేసిన విచారణలో.. మొదటి భార్యను ఆరేళ్ల క్రితం హత్య చేసిన విషయం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన పోలీసుల కథనం, విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. 


మొదట ప్రేమించానంటూ.. 
ఏనుగల్లుకు చెందిన కర్నె కిరణ్‌ మొదట రైల్వేస్టేషన్‌లో ఒక మహిళను చూసి ప్రేమించానంటూ వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెను తరచూ వేధించడంతో పాటు పలుమార్లు కొట్టి గాయపర్చడంతో ఆరేళ్ల క్రితం మృతి చెందింది. ఈ విషయం బయటకు పొక్కకుండా శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు.  


రెండేళ్ల క్రితం రెండో పెళ్లి 
వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్‌కు చెందిన ఓడపల్లి అంజలీ బాయి (43)ని 2019లో కిరణ్‌ పెళ్ళి చేసుకున్నాడు. రెండేళ్లుగా ఆమె ఇంటి వద్దే ఉండి, ఆరు నెలల క్రితం ఏనుగల్లుకు వచ్చాడు. అప్పట్నుంచీ ఇళ్లు అమ్మి డబ్బు తీసుకురావాలని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈక్రమంలోనే ఈనెల 13వ తేదీన తీవ్రంగా కొట్టడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14వ తేదీన మరణించింది. దీంతో పోలీసులు కిరణ్‌ను విచారించారు. ఈ క్రమంలో మొదటి భార్యను కూడా హత్య చేశానని, ఆమె శవాన్ని తాను ఉండే ఇంటి ఆవరణలోనే పాతిపెట్టానని వెల్లడించాడు. దీంతో పోలీసులు ఆదివారం మృతదేహాన్ని బయటకు తీయాలని నిర్ణయించారు.  

సైకో చేష్టలతో ఎర్రగడ్డలో చికిత్స 
నిందితుడు కిరణ్‌ వ్యవహార శైలి కారణం గా తల్లిదండ్రులు అతనికి వివాహం చేయకుం డా వదిలేశారు. దీంతో అక్కడక్కడా తిరుగు తూ తొలుత ఎవరూ లేని అనాథకు వల వేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ఇంట్లోనే బంధించి వేధింపులకు గురిచేసి చంపేశాడు. ఆమె అనాథ కావడంతో దీనిపై ఎలాంటి ఫిర్యా దు నమోదు కాలేదు. గతంలో ఓసారి కిరణ్‌ వ్యవహార శైలి తెలుసుకున్న అప్పటి పర్వతగిరి ఎస్సై రమేష్‌నాయక్‌ ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలిం చి చికిత్స చేయించినా తప్పించుకువచ్చాడు. గ్రామంలో ఉంటే మళ్లీ పోలీసులు వస్తారని భావించి వరంగల్‌లో ఉంటూ హుజూరాబాద్‌లో నర్సుగా పనిచేసే మహిళను రెండో వివాహం చేసుకుని ఆమె ఇంట్లోనే కాపురం పెట్టాడు. ఆరు నెలల క్రితం ఏనుగల్లుకు మకాం మార్చి, వేధింపులకు గురిచేసి చంపేశాడు. ఈ ఘటనపై అంజలీబాయి తల్లి ఓడపల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరేష్‌కుమార్‌ శనివారం తెలిపారు.   

మరిన్ని వార్తలు