యువకుణ్ణి హతమార్చి.. ఆనక నిప్పంటించారు 

25 Dec, 2022 05:52 IST|Sakshi
ఆమోస్‌ (ఫైల్‌)

కర్నూలు: గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన గాడిబండ ఆమోస్‌(26) దారుణ హత్యకు గురయ్యాడు. కల్లూరు మండలం శరీన్‌ నగర్‌ శివారులోని హంద్రీ నది ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి.. ఆ తరువాత పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆమోస్‌ ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా.. పరువు హత్య కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. డిగ్రీ వరకు చదువుకున్న ఆమోస్‌ ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కుమ్మరి గోపాల్‌ కుమార్తె అరుణను కులాంతర వివాహం చేసుకున్నాడు.

వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వారి వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేక మొదట్లో ఘర్షణలు జరిగాయి. దీంతో ఆమోస్‌  దంపతులు ఊరు వదిలి వచ్చేసి కొన్నాళ్లు ఆదోని, మరికొన్నాళ్లు ఎమ్మిగనూరులో కాపురం చేశారు. రెండేళ్ల క్రితం కర్నూలుకు వచ్చి కల్లూరు ఎస్టేట్‌లో నివాసముంటూ సిటీ స్క్యేర్‌ మాల్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  

అదృశ్యమైన రెండు రోజులకే.. 
ఆమోస్‌ రెండు రోజుల క్రితం అదృశ్యం కాగా.. శనివారం ఉదయం శరీన్‌నగర్‌ శివారులోని హంద్రీనది ఒడ్డున శవమై కనిపించాడు. జనసంచారం లేని ముళ్లపొదల చాటున మృతదేహం పడివుండగా.. బహిర్భూమికి వెళ్లినవారు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ కేవీ మహేష్, సీఐ శంకరయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 

మరిన్ని వార్తలు