పాతబస్తీలో రౌడీషీటర్‌ దారుణ హత్య

13 Mar, 2021 10:50 IST|Sakshi

  వెంటాడి మట్టుబెట్టిన దుండగులు 

చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో శుక్రవారం సాయంత్రం రౌడీ షీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌ను వెంటాడి వేటాడి హత్య చేశారు. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్‌ తెలిపిన మేరకు..  మైలార్‌దేవ్‌పల్లి ముస్తఫానగర్‌కు చెందిన అశ్రఫ్‌ కుమారుడు మహ్మద్‌ జాబేర్‌ (26) డెకరేషన్‌ పని చేస్తుంటాడు. నేరాలకు పాల్పడుతుండడంతో ఇతనిపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. గతేడాది కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రౌడీషీటర్‌ షానూర్‌ ఖాజీ హత్య కేసులో ఇతడు ఏ–5గా ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో సిగరెట్‌ తాగేందుకు సిటీ ప్లాజా ఫంక్షన్‌హాల్‌ వద్దకు వచ్చాడు. ఈ సమయంలో నలుగురైదుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతనితో వాగ్వాదానికి దిగారు. గొడవ పెద్దది కావడంతో దాడి చేస్తారని గ్రహించిన జాబేర్‌ అక్కడినుంచి పరిగెత్తాడు.

అయినప్పటికీ వదలకుండా నిందితులు అతన్ని అర కిలోమీటర్‌ మేర వెంటాడి కత్తులు, కోడవళ్లతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్, ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.దేవేందర్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటన జరిగిన స్థలం సరిహద్దులో ఉండడంతో ఫలక్‌నుమా, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు చాలా సేపటి వరకు తేల్చుకోలేకపోయారు. చివరకు ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. షానూర్‌ ఖాజీ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు