నీతో మాట్లాడాలి బయటకు రా..పెద్దగా కేకలు

9 May, 2021 15:15 IST|Sakshi

మల్కన్‌గిరి: చేతబడి చేస్తున్నాడన్న నెపంతో బుదురు పడియామి అనే వ్యక్తిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ దుర్ఘటన జిల్లాలోని పొడియా మండలం, నిలిగుడ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుదురు పడియామి ఇంటి వద్దనే ఉంటుండగా, అతడి దగ్గరికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ‘నీతో మాట్లాడాలి బయటకు రా’ అంటూ పెద్దగా అరిచారు. ఈ క్రమంలో ఆ ఇద్దరూ తమ వద్ద ఉన్న కత్తితో బయటకు వచ్చిన అతడి పీకను కోసేశారు.

దీంతో అక్కడికక్కడే అతడు పెద్దగా కేకలు వేస్తూ కుప్పకూలిపోగా, ఇంటి లోపల ఉన్న భార్య అతడి వద్దకు వచ్చి చూసింది. అయితే అప్పటికే అతడు చనిపోగా అతడి భార్య బోరుమని ఏడ్చింది. ఈలోపు నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి మృతదేహం తరలించారు.

మరిన్ని వార్తలు