హత్యచేసి పాతిపెట్టారు 

20 Mar, 2021 10:44 IST|Sakshi
నిందితులను అరెస్టు చూపుతున్న డీఎస్పీ గంగయ్య-(ఇన్‌సెట్‌)లో హతుడు నాగరాజు(ఫైల్‌)   

నెల రోజుల తరువాత బయటపడిన దారుణం

భార్య, ఆమె సోదరుడే నిందితులు

వివరాలను వెల్లడించిన డీఎస్పీ

పలమనేరు(చిత్తూరు జిల్లా): దాదాపు నెల కిందట జరిగిన ఓ హత్య శుక్రవారం వెలుగు చూసింది. భర్తను భార్య, వరుసకు ఆమె సోదరుడు కలిసి చంపేశారనే విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. హతుడు పలమనేరు మండలం పందేరుపల్లె వడ్డూరుకు చెందిన పసల నాగరాజు(38) కాగా ఈ కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.

ఆయన కథనం మేరకు పసల నాగరాజు, భాగ్యలక్ష్మి (34) కూలి పనులు చేసి జీవించేవారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల 26న బంగారుపాళెం మండలం అండరెడ్డిపల్లెకు చెందిన పసల గోపి తన తమ్ముడు పసల నాగరాజు 13 రోజులుగా కనిపించలేదని స్థానిక పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం భాగ్యలక్ష్మి కి వరుసకు సోదరుడు, మండలంలోని క్యాటిల్‌ ఫామ్‌కు చెందిన నవీన్‌ (30) తానే నాగరాజును హత్య చేసినట్టు మొరం వీఆర్వో సిద్ధేశ్వర్‌ ముందు లొంగిపోయాడు.  

మృతదేహాన్ని ముక్కలుచేసి... 
నవీన్‌కు కుమార్తెనిచ్చి పెళ్లి చేసేందుకు నాగరాజు నిరాకరించాడు. అంతేగాక అనుమానంతో తరచూ భార్యను హింసించేవాడు. ఈ నేపధ్యంలో భర్తను అంతమొందించాలని నవీన్‌ ద్వారా ఆమె స్కెచ్‌ వేసింది. గత నెల 12వ తేదీ రాత్రి ఇంట్లో నాగరాజు మద్యం మత్తులో ఉండగా, నవీన్‌ వెళ్లి అతడి తలపై బండరాయితో బాది చంపేశాడు. అతడు తీసుకెళ్లిన కత్తితో మొండెం, కాళ్లు, చేతులు, శరీర భాగాలను ముక్కలు చేశాడు. బాత్‌రూమ్‌ గుంతలో పూడ్చేశాడు. సైకిల్‌పై తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. శుక్రవారం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన  సీఐ జయరామయ్య, ఎస్‌ఐలు నాగరాజు, ప్రియాంక, వెంకటసుబ్బమ్మ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
చదవండి:
చిన్నారుల హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. 
చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని..

మరిన్ని వార్తలు