చెల్లి ప్రేమ వ్యవహరం: ఇంజినీర్‌ దారుణ హత్య

27 Apr, 2021 07:54 IST|Sakshi
భార్య, బిడ్డతో కృపన్‌రాజ్‌ (ఫైల్‌)

టీ.నగర్‌: తిరుచ్చి జిల్లా, లాల్గుడి సమీపంలో ఆదివారం ఓ ఇంజినీర్‌ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు లాల్గుడి సమీపంలోని తిరుమంగళంకు చెందిన  కృపన్‌రాజ్‌ (27) చెన్నైలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి రాబిన్‌సామేరి (26)తో ఏడాది క్రితం వివాహం జరిగింది. వీరికి మగబిడ్డ ఉన్నాడు. కృపన్‌రాజ్‌ సోదరి గిరిజను అతడి స్నేహితుడు, తిరుమంగళంకు చెందిన కవియరసన్‌ (27) ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో గిరిజకు వేరొక వ్యక్తితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిశ్చయించారు. అయితే గిరిజ, కవియరసన్‌ ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు.

ఇది కృపన్‌రాజ్‌కు నచ్చలేదు. ఈ విషయమై తరచూ గొడవలు జరుగుతున్నాయి. కృపన్‌రాజ్‌ ఆదివారం బైక్‌లో కవియరసన్‌ ఇంటి మీదుగా వెళుతుండగా అతని ఇద్దరు సోదరులు అటకాయించి వాగ్వాదానికి దిగారు.  కవియరసన్‌ కత్తితో కృపన్‌రాజ్‌పై దాడిచేశాడు. దీంతో అతడు స్పృహ తప్పాడు. వెంటనే  అతడిని లాల్గుడి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పంపారు. నిందితులు కవియరసన్, అతని సోదరుడు కలైవానన్‌ సోమవారం సమయపురం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.
చదవండి: భార్యకు కరోనా అని తెలిసి తల నరికి..

మరిన్ని వార్తలు