వైఎస్సార్‌ కడప: యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

18 Jun, 2021 20:42 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: జిల్లాలోని బద్వేలు మండలంలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతి గొంతు కోసి హత్య చేశాడు యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మకు 18 ఏళ్ల కూతురు శిరీష ఉంది. ఆమె బద్వేల్ వీరారెడ్డి కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత కొంత కాలంగా కచరణ్ అనే యువకుడు శిరీషను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు. ప్రస్తుతం కాలేజీ సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది.

ఈ క్రమంలో చరణ్ శుక్రవారం చింతల చెరువు గ్రామంలోకి వెళ్లి శిరీషను బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అక్కడే ఉన్న కత్తితో శిరీష గొంతు కోశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న శిరీష అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన గ్రామస్తులు నిందితుడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పృహ కోల్పోయిన చరణ్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జగిత్యాల ఎస్సై.. వెక్కి వెక్కి ఏడుస్తూ

మరిన్ని వార్తలు