పెళ్లయిన 43వ రోజు భార్య గొంతు కోసి దారుణ హత్య 

8 Apr, 2021 11:08 IST|Sakshi

సాక్షి, చెన్నై: నిండు నూరేళ్లు సాగాల్సిన ఓ కొత్త జంట జీవితంలో అనుమానం పెనుభూతం అయింది. పెళ్లైయి 43వ రోజే ఆ భర్త కిరాతకుడయ్యాడు. భార్య గొంతు కోసి హతమార్చి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సేలం జిల్లా వీరాణం ఒరత్తరు పట్టికి చెందిన తంగరాజ్‌(33) రైతు, కేబుల్‌ ఆపరేటర్‌. కన్నంకురిచ్చి గ్రామానికి చెందిన మోనీషా(19)తో 43 రోజుల క్రితం  తంగరాజ్‌కు వివాహమైంది. తన ఎకరం పొలంలో వద్దే ఇంటిని నిర్మించుకుని ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం వీరి ఇంటి తలుపు ఎంతకు తెరుచుకోలేదు. దీంతో బంధువులు తలుపు పగులకొట్టి లోనికి వెళ్లారు. అక్కడ గొంతు కోసి హతమార్చిన స్థితిలో మోనీసా, కేబుల్‌ వైర్‌కు ఉరిపోసుకుని తంగరాజ్‌ వేళాడుతుండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకున్న వీరానం పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల విచారణలో గత నెల 24వ తేదీన మోనీషా అత్త మోహన కుమారుడు ఇంటికి వచ్చి వెళ్లినట్టు తేలింది. ఆ రోజున తన బర్త్‌డే సందర్భంగా కేక్‌ ఇవ్వడానికి అత్త కుమారుడు వచ్చినా, తంగరాజ్‌ మాత్రం అనుమానంతో వేధించడం మొదలెట్టాడు.

అలాగే, మోనీషా సోదరి, అత్త మోహన మరో కుమారుడితో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుండడాన్ని చూసిన తంగరాజ్‌లో అనుమానం పెనుభూతమై కూర్చుంది. ఈ అనుమానంతోనే భ్యార మోనీషాను గొంతు కోసి హతమార్చి ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. ముందుగా తంగరాజ్‌ విషం తాగి, ఆ తర్వాత ఉరి వేసుకున్నట్టు విచారణలో వెలుగు చూసిందని వీరాణం పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: రాసలీలల వీడియో.. ఆమెను సస్పెండ్‌ చేశారు!

మరిన్ని వార్తలు