కుడి చేతిపై లవ్‌ సింబల్‌.. భార్య ప్రవర్తనతో భర్త షాక్‌.. చివరికి ఏం చేశాడంటే?

31 Aug, 2022 13:14 IST|Sakshi

మల్కాజిగిరి(హైదరాబాద్‌): భార్య ప్రవర్తనపై అనుమానంతో ఆమెను హత్య చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ జగదీశ్వర్‌, ఎస్సై హరిప్రసాద్‌ వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆముదాలగడ్డ తండాకు చెందిన సబావత్‌ పెంట్యా నాయక్‌ ముగ్గురు కుమార్తెలు. 15 ఏళ్ల క్రితం రెండవ కూతురు లలిత అలియాస్‌ సునీత(25)ను అదేజిల్లా కొయిలకొండ మండలం చింతల్‌తండాకు చెందిన కాట్రావత్‌ శంకర్‌తో వివాహం జరిపించాడు.
చదవండి: అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. భర్త షాకింగ్‌ నిర్ణయం..

వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. సునీత టైలరింగ్‌ పని చేస్తుండగా శంకర్‌ మేస్త్రీ పని చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా భార్య ప్రవర్తనను అనుమానిస్తూ తరచూ ఆమెతో గొడవ పడేవాడు. ఇటీవల ఆమె కుడి చేతిపై లవ్‌ సింబల్‌ టాట్యూ వేయించుకుంది. దీనితో అనుమానాలు వ్యక్తం చేస్తూ రోజు గొడవ పడేవారు. ఈ నెల 29న భార్యతో గొడవపడి ఆమె తండ్రికి ఫోన్‌ చేసి కూతురును తీసుకెళ్లమని చెప్పాడు. 30న తెల్లవారుజామున నిద్రిస్తున్న లలిత రక్తపు గాయాలతో పడి ఉండడంతో ఆమె పిల్లలు చూసి పక్కింటి వారికి సమాచారం అందించారు. బలమైన ఆయుధంతో ఆమె కుడివైపు కణతి పై అల్లుడు దాడి చేయడంతో తన కూతురు అక్కడికక్కడే మృతి చెందిందని మృతురాలి తండ్రి పెంట్యానాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.   

మరిన్ని వార్తలు