వివాహేతర సంబంధం.. హైదరాబాద్‌ తీసుకువెళ్లిపోతే.. తనకు దూరమైపోతుందని..

24 Sep, 2022 16:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జగ్గంపేట(కాకినాడ జిల్లా): ప్రియురాలి కోసం ఆమె భర్తను హతమార్చిన నిందితుడిని జగ్గంపేట పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. జగ్గంపేట సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ ఎస్‌.మురళీమోహన్‌ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని మల్లిసాలకు చెందిన బొల్లం శివప్రసాద్‌ అలియాస్‌ శివ (27) వ్యాన్‌ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
చదవండి: విద్యార్థిపై ‘నారాయణ’ లెక్చరర్‌ ప్రతాపం

ఈ నెల 18వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అతడు హత్యకు గురయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన అంగటి అప్పలరాజు అలియాస్‌ అప్పన్న ఐస్‌క్రీములు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. హతుడు శివ అత్తవారి ఊరు కాట్రావులపల్లి. ఆ గ్రామంలో ఐస్‌క్రీములు అమ్మే క్రమంలో శివ భార్యతో, ఆమె పుట్టింటి వారితో అప్పన్నకు పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో శివ భార్యకు, అప్పన్నకు కొంత కాలంగా వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఇదిలా ఉండగా శివ వేరే ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయం భార్యకు చెప్పాడు. ఆమె ద్వారా ఆ విషయం ప్రియుడు అప్పన్నకు తెలిసింది. తన ప్రియురాలిని ఆమె భర్త హైదరాబాద్‌ తీసుకువెళ్లిపోతే.. తనకు దూరమైపోతుందని అప్పన్న భావించేవాడు. ఈ విషయమై అప్పన్నకు, శివ భార్యకు మధ్య సుదీర్ఘంగా సెల్‌ఫోన్‌ సంభాషణలు జరిగాయి. ఈ నేపథ్యంలో శివను అడ్డు తొలగించుకోవాలని అప్పన్న నిర్ణయించుకున్నాడు.

శివ ఇంటికి వచ్చే సమయానికి ఇంటి గేటుకు కరెంటు పెట్టి హతమార్చాలని కొద్ది రోజుల క్రితం అప్పన్న విఫలయత్నం చేశాడు. అనంతరం ఈ నెల 18న పథకం ప్రకారం ముందుగానే వెల్దుర్తి నుంచి వచ్చి, కాపు కాసి నిద్ర పోతున్న శివను కత్తితో పొడిచి హతమార్చాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని, మోటార్‌ సైకిల్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఈ హత్యలో శివ భార్య ప్రమేయం ఉందా అనే అంశంపై విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఈ కేసును చాకచక్యంగా విచారణ చేసి నిందితుడిని అరెస్టు చేసిన జగ్గంపేట సీఐ సూరి అప్పారావు, ఎస్సై రఘునాథరావులను డీఎస్పీ మురళీమోహన్‌ అభినందించారు.  

మరిన్ని వార్తలు